కరోనా: యూపీ సీఎం కీలక నిర్ణయం: 36లక్షల మంది కూలీలకు రూ. 1000 సాయం
లక్నో: కరోనావైరస్ వేగంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో దేశంలోని అన్ని రాష్ట్రాలు ముందస్తు చర్యలు చేపడుతున్నాయి. అయితే, కరోనాను వ్యాపించకుండా షాపింగ్ మాల్స్, థియేటర్లు, ఇతర కార్యకలాపాలను ప్రభుత్వాలు రద్దు చేస్తుండటంతో ఉపాధి కూలీలు తీవ్రంగా నష్టపోతున్నారు. ఉపాధి లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఈ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఉపాధి కోల్పోయే రోజువారీ శ్రామికులకు నెలకు రూ. 1000 చొప్పున అందజేయనున్నట్లు ప్రకటించారు. ఈ నిర్ణయం వల్ల ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని సుమారు 36 లక్షల మందికి సాయం అందనుంది. వీరిలో సుమారు 15 లక్షల రోజువారీ కూలీలు కాగా, 20.37 లక్షల గృహ నిర్మాణ కార్మికులకు ప్రయోజనం చేకూరనుంది. ఈ మొత్తాన్ని లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లోకి నేరుగా అందజేస్తామని సీఎం యోగి ఆదిత్యనాథ్ తెలిపారు. కరోనా నివారణకు రాష్ట్రంలో అమలు చేస్తున్న మూసివేతవలన ఉపాధి కోల్పోయే శ్రామికుల సహాయార్థం ఈ మేరకు నిర్ణయం తీసుకున్నామని యోగి చెప్పారు.
ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన పిలుపు మేరకు ఆదివారం ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు జనతా కర్ఫ్యూను దేశ ప్రజలందరూ పాటించాలని కోరారు. రాష్ట్రంలో అన్ని మెట్రో రైళ్లు, ప్రభుత్వ బస్సు సర్వీసులు ఆదివారం నిలిపివేస్తున్నట్లు ఆయన తెలిపారు. రాష్ట్రంలో నిత్యావసర సరుకులు, వస్తువులు, మందులు అందుబాటులో ఉన్నాయని ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. దుకాణాలు వద్దకు జనం పరుగులు తీయాల్సిన అవసరం లేదని అన్నారు. కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటోందని చెప్పారు. ఐసోలేషన్ వార్డులు ఏర్పాటు చేశామని, బాధితులకు చికిత్స అందిస్తున్నామని తెలిపారు. కాగా, యూపీలో ఇప్పటి వరకు 23 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దేశ వ్యాప్తంగా 298 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ఇప్పటికే ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. అవసరముంటేనే బయటకు రావాలని ప్రభుత్వాలు ప్రజలను ఆదేశించాయి. దీంతో ప్రతి ఒక్కరూ నివాసాలకే పరిమితం అవుతున్నారు. అన్ని పనులు వాయిదా వేడయంతో.. దినసరి కూలీల పరిస్థితి ధీనంగా మారింది. రెక్కాడితే గానీ డొక్కాడని రోజువారి కూలీలకు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆఫర్ ప్రకటించారు. యూపీలోని 15 లక్షల మంది రోజువారి కూలీలతో పాటు భవన నిర్మాణ రంగంలో పని చేసే 20.37 లక్షల మంది కార్మికులకు రోజుకు రూ. వెయ్యి చొప్పున ఇస్తామని యోగి స్పష్టం చేశారు. ఈ డబ్బు.. కూలీల నిత్యవసర సరుకులకు, పనులకు ఉపయోగపడుతుందని యూపీ సీఎం పేర్కొన్నారు. ఉత్తరప్రదేశ్లో ఇప్పటి వరకు 23 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. వీరిలో 9 మంది కోలుకున్నారు. ఐసోలేషన్ వార్డులను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.