కోయంబేడు మార్కెట్ రచ్చ..రచ్చ: లాక్డౌన్ వేళ.. పూల వ్యాపారుల భారీ ఆందోళన: తీవ్ర ఉద్రిక్తత
చెన్నై: తమిళనాడు సహా ఏపీలో కూడా కరోనా వైరస్ పాజిటివ్ కేసులు భారీ సంఖ్యలో పెరగడానికి ప్రధాన కారణాల్లో ఒకటి.. చెన్నైలోని కోయంబేడు మార్కెట్. ఈ మార్కెట్ ప్రభావం వల్ల తమిళనాడు సరిహద్దు జిల్లాలైన నెల్లూరు, చిత్తూరు మాత్రమే కాదు.. అటు తూర్పు గోదావరి, ఇటు కర్నూలులోనూ పదుల సంఖ్యలో పాజిటివ కేసులు నమోదు అయ్యాయి. తమిళనాడులో వేల సంఖ్యలో పాజిటివ్ కేసులు పెరగడానికీ ఈ మార్కెట్ కూడా ఓ చెయ్యి వేసింది. దీన్ని హాట్స్పాట్గా ప్రకటించింది అక్కడి ప్రభుత్వం.
శ్రీవారి భక్తుల ఆశలపై నీళ్లు చల్లిన కేంద్రం: కరోనా వ్యాప్తి చెందకుండా: అయినా..54 రోజులుగా
అలాంటి కోయంబేడు మార్కెట్లో సోమవారం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వందలాది మంది పూల వ్యాపారులు నిరసన ప్రదర్శనలు, ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో పరిసర ప్రాంతాలు మారుమోగిపోయాయి. కోయంబేడుకు అనుసంధానంగా కొనసాగుతోన్న పూల మార్కెట్ను వెంటనే తెరవాలంటూ వారంతా ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నారు. మార్కెట్ వద్ద బైఠాయించారు. వారిని సర్ది చెప్పడానికి పోలీసులు విఫలయత్నం చేశారు. కోయంబేడు మార్కెట్ మొత్తం రెడ్జోన్ పరిధిలో ఉందని, తెరవడానికి అనుమతులు లేవని సర్ది చెప్పారు. అయినప్పటికీ.. వారు వినిపించుకోలేదు. నిరసనలను చేపట్టారు.
కోయంబేడు మార్కెట్లో పెద్ద ఎత్తున పువ్వుల వ్యాపారం కొనసాగుతుంటుంది. దక్షిణాది రాష్ట్రాలకు ఇక్కడి నుంచి పువ్వులు రవాణా అవుతుంటాయి. కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి దేశవ్యాప్తంగా లాక్డౌన్ ప్రకటించిన ఈ మార్కెట్ కూడా మూత పడింది. వ్యాపార లావాదేవీలు స్తంభించిపోయాయి. లక్షల రూపాయల మేర ఆర్థిక కార్యకలాపాలు నిలిచిపోయాయి. సోమవారం నుంచి అమల్లోకి వచ్చిన 14 రోజుల నాలుగో విడత లాక్డౌన్ సందర్భంగా ఈ మార్కెట్ను పునరుద్ధరిస్తారని పూల వ్యాపారులు భావించారు.
కేసుల తీవ్రతను దృష్టిలో ఉంచుకుని అలాంటి సాహసానికి పూనుకోలేదు ఎడప్పాడి పళనిస్వామి ప్రభుత్వం. దీనితో కోయంబేడు పూల మార్కెట్ వ్యాపార సంఘాల సమాఖ్య నాయకులు ఈ ఉదయం పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలకు దిగారు. మార్కెట్ వద్ద బైఠాయించారు. గేట్లను వెంటనే తెరవాలని డిమాండ్ చేశారు. కోయంబేడు మార్కెట్ను మూసివేయడం వల్ల వందలాది మంది వ్యాపారులు, వారి కుటుంబాలకు పూట గడవని పరిస్థితి నెలకొందని, వెంటనే పునరుద్ధరించాలని సమాఖ్య నాయకులు మూకయ్య డిమాండ్ చేస్తున్నారు.
Recommended Video
ఈ ఒక్క మార్కెట్ మీద ఆధారపడి రెండువేలకు పైగా కటుంబాలు జీవనాన్ని కొనసాగిస్తున్నాయని అన్నారు. ఆయా కుటుంబాలన్నీ ఆకలితో అలమిస్తున్నాయని అన్నారు. దినసరి వేతన కార్మికులు, చిరు వ్యాపారులు ఉపాధిని కోల్పోయారని మూకయ్య అన్నారు. కరోనా వైరస్ హాట్స్పాట్ పేరుతో రోజుల తరబడి మార్కెట్ను మూసివేయడం సరికాదని చెప్పారు. ప్రభుత్వం వెంటనే దిగొచ్చి, మార్కెట్ను తెరవడానికి ఆదేశాలు జారీ చేసేంత వరకూ తాము ఇక్కడి నుంచి కదలబోమని తేల్చి చెప్పారు.