బ్లాక్ మెయిల్ చేయను, వెన్నుపోటు పొడవను- ఢిల్లీ బయలుదేరే ముందు డీకే శివకుమార్ కామెంట్స్..
కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన కాంగ్రెస్ పార్టీకి సీఎం పదవి ఎంపిక మాత్రం కష్టసాధ్యంగా మారుతోంది. కన్నడనాట కాంగ్రెస్ పార్టీని విజయపథాన నిలబెట్టడంలో ఎవరికి వారే కీలకపాత్ర పోషించిన సిద్దరామయ్య, డీకే శివకుమార్ లలో ఎవరిని సీఎం చేయాలనే విషయంలో కాంగ్రెస్ పార్టీ ఎటూ తేల్చుకోలేకపోతోంది. ఇప్పటికే ఎమ్మెల్యేల నుంచి అభిప్రాయ సేకరణ చేసిన కాంగ్రెస్ హైకమాండ్ కు సిద్ధరామయ్య విషయంలో క్లారిటీ వచ్చేసింది. అయితే ఆయన్ను వెంటనే సీఎం చేసేస్తే డీకే శివకుమార్ అసంతృప్తికి గురయ్యే అవకాశం ఉండటంతో బుజ్జగింపులు చేస్తోంది.
కర్నాటక సీఎం పదవికి సిద్దరామయ్య పేరును దాదాపు ఖరారు చేసిన కాంగ్రెస్ అధిష్టానం.. ఇక ఈ పదవిపై ఆశలు పెట్టుకున్న పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ ను బుజ్జగించేందుకు ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో నిన్నటి నుంచి ఆయనతో జరుపుతున్న సంప్రదింపులు కొలిక్కిరావడంతో ఇవాళ ఆయన ఢిల్లీ వచ్చేందుకు అంగీకరించారు. దీంతో ఉదయం ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. అంతకు ముందు మీడియాతో మాట్లాడుతూ డీకే కీలక వ్యాఖ్యలు చేశారు.

కాంగ్రెస్ పార్టీ తనకు దైవంతో సమానమని, తల్లి లాంటిదని డీకే శివకుమార్ వ్యాఖ్యానించారు. పిల్లలకు ఏం ఇవ్వాలో తల్లికి తెలుసంటూ సోనియా గురించి అన్నారు. అలాగే దైవాన్ని కలిసేందుకు గుడికి వెళ్తున్నట్లు తన ఢిల్లీ పర్యటన గురించి డీకే శివకుమార్ వెల్లడించారు. అలాగే తాను ఇవాళ ఉన్న పరిస్దితికి కాంగ్రెస్ పార్టీయే కారణమన్నారు. సోనియాగాంధీపై తనకు పూర్తి నమ్మకం ఉందన్నారు.
రాబోయే లోక్ సభ ఎన్నికల్లో 20 సీట్లు గెలవడం మా తదుపరి సవాల్ అని డీకే శివకుమార్ తెలిపారు. తమది సమైక్య వేదిక అని, ఇక్కడ ఎవరినీ విభజించడం తనకు ఇష్టం లేదన్నారు. తాను బాధ్యతగల మనిషినని, వెన్నుపోటు పొడవనని, బ్లాక్మెయిల్ చేయనని డీకే వ్యాఖ్యానించారు. తప్పుడు చరిత్రలోకి వెళ్లాలనుకోవడం లేదు, చెడు వ్యాఖ్యతో వెళ్లడం ఇష్టం లేదంటూ పేర్కొన్నారు. తద్వారా తనకు సీఎం పదవి దక్కకపోయినా తీవ్ర నిర్ణయాలు తీసుకోబోననే సంకేతాలు ఇచ్చారు.












Click it and Unblock the Notifications