తెరపై కృష్ణ జన్మభూమి: మథురలోని ఆ స్థలంలో షాహి ఈద్గా నిర్మాణం- తేల్చేయనున్న కోర్ట్
లక్నో: చారిత్రాత్మక రామ జన్మభూమి- బాబ్రీ మసీదు వివాదం సమసిపోయింది. అయోధ్యలో నిర్మించిన బాబ్రీ మసీదు స్థలం రామ జన్మభూమి ట్రస్ట్కే చెందుతుందంటూ దేశ అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. దీనిపై కౌంటర్, రివ్యూ పిటీషన్లు దాఖలైనప్పటికీ- అది పెద్దగా ప్రభావాన్ని చూపలేదు. అదే సమయంలో సుప్రీంకోర్టు ఆదేశాలు వెలువడిన నేపథ్యంలో- అయోధ్య రామ మందిర నిర్మాణం సైతం జోరుగా సాగుతోంది.
ఇక తాజాగా- కృష్ణ జన్మభూమి అంశం తెర మీదికి వచ్చింది. ఉత్తర ప్రదేశ్లోని మథురలో శ్రీ కృష్ణ పరమాత్ముడు జన్మించిన స్థలంలో షాహి ఈద్గా మసీదు నిర్మితమైందంటూ పలు పిటీషన్లు దాఖలయ్యాయి. వారణాసిలోని జ్ఞాన్వాపి మసీదులో శివలింగాన్ని గుర్తించినట్లే షాహి ఈద్గా పునాదుల కింద కృష్ణ జన్మభూమి ఉందనేది ఆ పిటీషన్ల సారాంశం. దీనిపై సర్వే చేయాలంటూ పిటీషనర్లు మథుర జిల్లా న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.
హిందూ సేన జాతీయ అధ్యక్షుడు విష్ణు గుప్తా, ఉపాధ్యక్షుడు సుర్జిత్ సింగ్ యాదవ్ ఈ నెల 8వ తేదీన ఈ పిటీషన్లను దాఖలు చేశారు. పిటీషనర్ల తరఫున సీనియర్ అడ్వొకేట్ శైలేష్ దూబే ఈ కేసును వాదిస్తోన్నారు. వాటిని విచారణకు స్వీకరించింది మథుర జిల్లా న్యాయస్థానం. కొద్దిసేపటి కిందటే కీలక ఆదేశాలను జారీ చేసింది.
షాహి ఈద్గా స్థలాన్ని సర్వే చేయాలంటూ ఆదేశించింది. జనవరి 2వ తేదీ తరువాత సర్వే చేపట్టాలని సూచించింది. అదే నెల 20వ తేదీ నాటికి సర్వే నివేదికలను తమకు అందజేయాలని పేర్కొంది. ఈ మేరకు మథుర న్యాయస్థానం- పురావస్తు శాఖ అధికారులకు ఈ ఆదేశాలను జారీ చేసింది. ఈ కేసులో తదుపరి విచారణను జనవరి 20వ తేదీగా వాయిదా వేసింది.
1669-70లో మధ్యకాలంలో శ్రీకృష్ణుడు జన్మించిన స్థలంలో అప్పటి మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు ఈ షాహీ ఈద్గాను నిర్మించారని విష్ణు గుప్తా తన పిటీషన్లో పేర్కొన్నారు. 13.37 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన షాహి ఈద్గా స్థలంలో ఇదివరకు కాట్రా కేశవ్ దేవ్ ఆలయం ఉండేదని చెప్పారు. 1968లో శ్రీకృష్ణ జన్మస్థాన సేవా సంఘ్, షాహీ ఈద్గా మధ్య జరిగిన ఒప్పందాన్ని చట్టవిరుద్ధమని పేర్కొంటూ దీన్ని రద్దు చేయాలని విష్ణు గుప్తా డిమాండ్ చేశారు.