ఎల్లుండి నుంచి కృష్ణా బోర్డు గెజిట్ అమలు-ప్రాజెక్టులు అప్పగించాలన్న కేఆర్ఎంబీ
కృష్ణా నదీ ప్రాజెక్టులకు సంబంధించి గతంలో కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్ ఎల్లుండి నుంచి అమల్లోకి రాబోతోంది. ఈ మేరకు కృష్ణానదీ యాజమాన్య బోర్డు కేఆర్ఎంబీ ఇవాళ ప్రకటన విడుదల చేసింది. ఈ నేపథ్యంలో కృష్ణా నదీ ప్రాజెక్టులను తమకు అప్పగించాలని ఇరు తెలుగు రాష్ట్రాల్ని కోరింది.
ఏపీ విభజన చట్టంలోని రెండో షెడ్యూల్ లో ఉన్న కృష్ణా నదీ ప్రాజెక్టుల అన్ని డైరెక్ట్ అవుట్ లెట్లను తమ పరిధిలోకి తీసుకోవాలని రివర్ బోర్డు నిర్ణయించింది. ఈ మేరకు వాటన్నింటినీ తమకు అప్పగించాలని ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలను కోరింది. రివర్ బోర్డు ప్రకటన నేపథ్యంలో కృష్ణా నదిపై ఉన్న శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టుల కింద ఉన్న అన్ని అవుట్ లెట్లు కూడా బోర్డు పరిధిలోకి రాబోతున్నాయి. ఇవన్నీ కేంద్రం ఇచ్చిన గెజిట్ నోటిఫికేషన్ పరిధిలోకి రాబోతున్నాయి.
కృష్ణా నదీ ప్రాజెక్టులపై కేంద్రం ఇచ్చిన గెజిట్ నోటిఫికేషన్ ప్రకారం తొలిదశలో ఐదు ప్రాజెక్టుల పరిధిలోని 29 అవుట్ లెట్లు బోర్డు పరిధిలోకి రానున్నాయి. ఇందులో తెలంగాణలోని శ్రీశైలం ఎడమ విద్యుత్ కేంద్రం, కల్వకుర్తి ఎత్తిపోతల మొదటి పంప్ హౌస్, నాగార్జున సాగర్ కింద ఉన్న 15 అవుట్ లెట్లు, సాగర్ టెయిల్ పాండ్ కింద ఉన్న హెడ్ వర్క్స్, విద్యుత్ బ్లాక్, పులిచింతల ప్రాజెక్టు కింద ఉన్న హెడ్ వర్క్స్, విద్యుత్ బ్లాక్, కేసీ కెనాల్ కింద ఉన్న సుంకేశుల, బీఆర్డీఎస్ కింద ఉన్న క్రాస్ రెగ్యులేటర్ కూడా బోర్డు పరిధిలోకి వస్తాయి.
అలాగే ఏపీలోని శ్రీశైలం స్పిల్ వే, కుడి విద్యుత్ కేంద్రం, పోతిరెడ్డి పాడు, హంద్రీనీవా ఎత్తిపోతల పంప్ హౌస్, ముచ్చుమర్రి పంప్ హౌస్ బోర్డు పరిధిలోకి రానున్నాయి. ఈ 29 పాయింట్లు కాక మిగిలిన వాటిపై ఇరు రాష్ట్రాల నుంచి అభ్యంతరాలు ఉన్న నేపథ్యంలో వీటిని ఇప్పటికిప్పుడు తమ పరిధిలోకి తీసుకోవడం సాధ్యం కాదని కేఆర్ఎంబీ చెబుతోంది. తమ పరిధిలోకి వస్తున్న ప్రాజెక్టుల మేరకు ప్రాజెక్టుల వారీగా సిబ్బంది, కార్యాలయాలు, యంత్రాలు, పరికరాలపై నివేదికలు తయారు చేసింది.