వయోవృద్ధులకు ఆర్టీసీ అధికారుల హైఓల్టేజీ షాక్: బస్సు ఛార్జీల్లో రాయితీని ఎత్తేసిన అధికారులు
బెంగళూరు: ప్రాణాంతక కరోనా వైరస్ ప్రభావం అధికంగా ఉన్న రాష్ట్రల్లో రెండోస్థానంలో నిలిచింది కర్ణాటక. మనదేశంలో కరోనా వైరస్ బారిన పడి మరణించిన తొలి కేసు కూడా నమోదైంది ఈ రాష్ట్రంలోనే. కర్ణాటకలోని కలబురగికి చెందిన 74 సంవత్సరాల వృద్ధుడొకరు
కరోనా వైరస్ బారిన పడి మరణించారు. దీనితోపాటు- ప్రస్తుతం నమోదైన కరోనా పాజిటివ్ కేసుల్లో వయోధిక వృద్ధులే మెజారిటీ సంఖ్యలో ఉన్నారు. పైగా- 65 సంవత్సరాలకు పైబడిన వృద్ధులకు కరోనా వైరస్ మరింత సులువుగా సోకుతుంది.
ఈ పరిస్థితుల్లో వయోధిక వృద్ధులు బస్సుల్లో ప్రయాణించకుండా కొన్ని కీలక నిర్ణయాలను తీసుకుంది కర్ణాటక రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ. బస్సుల్లో ప్రయాణించే వృద్ధులకు కల్పిస్తోన్న రాయితీని ఎత్తి పారేసింది. ఇకపై కేఎస్ఆర్టీసీ బస్సుల్లో వయోవృద్ధులు ప్రయాణాంచాల్సి ఉంటే పూర్తి ఛార్జీని చెల్లించాల్సి ఉంటుందని సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ శనివారం ఓ ప్రకటనలో వెల్లడించారు. ఈ ఎత్తివేత తాత్కాలికమేనని, కరోనా వైరస్ నియంత్రణలోకి వచ్చిన తరువాత దీన్ని పునఃప్రవేశపెడతామని పేర్కొన్నారు. ఈ విధానాన్ని ఈశాన్య ఆర్టీసీ, నైరుతి ఆర్టీసీల్లో కూడా ఈ విధానాన్ని అమలు చేసే అవకాశాలు ఉన్నాయి.

కర్ణాటక ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే వృద్ధులకు టికెట్లో 25 శాతం రాయితీని కల్పిస్తోంది అక్కడి ప్రభుత్వం. కేఎస్ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే వారిలో సగటున సగంమందికి పైగా వృద్ధులే ఉంటారని అధికారులు చెబుతున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న కరోనా భీతావహ వాతావరణంలో వృద్ధుల ప్రయాణంపై ఆంక్షలను విధించాల్సి వచ్చిందని అంటున్నారు. 65 సంవత్సరాలకు పైబడిన వృద్ధుల్లో రోగ నిరోధక శక్తి తక్కువగా ఉంటుందని, ఫలితంగా- మిగిలిన వయస్సు వారితో పోల్చుకుంటే కరోనా వైరస్ వృద్ధులపై తీవ్ర ప్రభావం చూపుతుందని చెబుతున్నారు.
వృద్ధుల ప్రయాణాన్ని నియంత్రించడంలో భాగంగా- సీనియర్ సిటిజన్స్ రాయితీని తాత్కాలికంగా రద్దు చేసినట్లు తెలిపారు. పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకున్న తరువాత.. దీన్ని పునరుద్ధరిస్తామని కేఎస్ఆర్టీసీ అధికారులు స్పష్టం చేశారు. ఎప్పుడు పునరుద్ధరిస్తారనే విషయంపై అధికారులు స్పష్టత ఇవ్వడానికి నిరాకరిస్తున్నారు. కరోనా వైరస్ ప్రభావం కొనసాగినన్ని రోజులు రాయితీని రద్దు చేసినట్లేనని వారు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications