కర్నాటకంలో కీలక మలుపు.. బలపరీక్షకు టైం ఫిక్స్ చేయండన్న సీఎం..
బెంగళూరు : కర్నాటకం కీలక మలుపు తిరిగింది. తాజా పరిణామాల నేపథ్యంలో సీఎం కుమారస్వామి తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధమవుతున్నారు. అసెంబ్లీలో బల నిరూపణకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. తమ ప్రభుత్వానికి మెజార్టీ ఉందని, దాన్ని నిరూపించుకునేందుకు రెడీగా ఉన్నామని చెప్పారు. బలపరీక్షకు సమయం ఖరారు చేయాలని కుమారస్వామి స్పీకర్ రమేష్ కుమార్ను కోరారు.
చచ్చినా జేడీఎస్ తో దోస్తీ లేదు: బీజేపీ మాజీ సీఎం, ఓపిక లేదు, తండ్రీ కొడుకుల డ్రామాలు !
కర్నాటకలో ఎమ్మెల్యేల రాజీనామాలతో రాజకీయాలు క్షణక్షణం ఉత్కంఠగా మారుతున్నాయి. అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. దీంతో రాష్ట్రంలో రాజకీయ సందిగ్దత నెలకొంది. ఈ నేపథ్యంలో కుమారస్వామి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత పరిణామాల దృష్ట్యా తాను పదవిలో కొనసాగే పరిస్థితి లేదని, అయితే తనకు ఎమ్మెల్యేల మద్దతు ఉందని కుమారస్వామి తేల్చిచెప్పారు. అసెంబ్లీలో దాన్ని నిరూపించుకుంటానని విశ్వాసం వ్యక్తం చేశారు.
కుమారస్వామి ప్రకటనతో కర్నాటక రాజకీయ సంక్షోభం కీలక మలుపు తిరిగింది. బలపరీక్షకు స్పీకర్ ఎప్పుడు సమయం ఇస్తారన్న అంశం ఆసక్తికరంగా మారింది. రెబెల్ ఎమ్మెల్యేల అనర్హత వేటుపై యథాతథ స్థితి కొనసాగించాలని సుప్రీంకోర్టు తీర్పు వెలువరించిన కొద్ది సేపటికే కుమారస్వామి విశ్వాస పరీక్షకు సిద్ధమవడం చర్చనీయాంశంగా మారింది.