చిరు ఆలోచించుకోవాల్సింది: జైట్లీ అభ్యంతరంపై కురియన్
న్యూఢిల్లీ: ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ మంత్రివర్గంలో ఉండాలా, లేదా అనేది సభాధ్యక్షుడికి సంబంధం లేదని, అలా ప్రభుత్వంలో కొనసాగాలా, వద్దా అనేది సభ్యుడి నైతికతకు సంబంధించిందని సభాధ్యక్ష స్థానంలో ఉన్న కురియన్ రూలింగ్ ఇచ్చారు. చిరంజీవి తెలంగాణపై గురువారం సాయంత్రం రాజ్యసభలో మాట్లాడుతున్న సమయంలో బిజెపి సభ్యుడు అరుణ్ జైట్లీ పాయింట్ ఆఫ్ ఆర్డర్ లేవనెత్తారు. మంత్రివర్గంలో ఉంటూ ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకించడం ఎంత వరకు సమంజసమని అడిగారు.
అరుణ్ జైట్లీ పాయింట్ ఆఫ్ ఆర్డర్ను సమర్థిస్తూ చిరంజీవి మంచి నటుడని ఎం వెంకయ్య నాయుడు అన్నప్పుడు అభ్యంతరం వ్యక్తమైంది. దీంతో వెంకయ్యనాయుడు వెండితెరపై మంచినటుడని, పాపులర్ యాక్టర్ అని అన్నారు. బిల్లుపై తమ తరఫున ఎవరు మాట్లాడాలనేది అధికార పక్షం నిర్ణయించుకుంటుందని, అలాగే సభ్యుడు ఇలా మాట్లాడాలని సభాధ్యక్షుడు నిర్దేశించలేడని కురియన్ జైట్లీ పాయింట్ ఆఫ్ ఆర్డర్పై స్పష్టం చేశారు. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ప్రభుత్వంలో కొనసాగాలా వద్దా అనేది నిర్ణయించుకోవాల్సిన నైతికత సభ్యుడికి సంబంధించిందేనని ఆయన రూలింగ్ ఇచ్చారు.

ఆ తర్వాత చిరంజీవి తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ తనను మంచి నటుడు అన్నందుకు వెంకయ్యనాయుడికి కృతజ్ఞతలు తెలిపారు. ఆయన తెలుగులో ఈ విషయం మాట్లాడారు. తాను ప్రజల తరపున మాట్లాడుతున్నానని చిరంజీవి అరుణ్ జైట్లీ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. తాను ప్రజల తరఫున మాట్లాడుతున్నానని అరుణ్ జైట్లీకి చెప్పదలుచుకున్నట్లు ఆయన తెలిపారు.
తెలంగాణపై తెలుగుదేశం వైఖరిని చిరంజీవి ప్రశ్నిస్తున్నప్పుడు చిరంజీవికి తెలంగాణ సభ్యుల నుంచి మంత్రుల నుంచి మద్దతు లభించింది. తాను పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని చెప్పినట్లు ఆయన తెలిపారు. అప్పటి వరకు నిరసనలతో హోరెత్తిన సభ చిరంజీవి మాట్లాడడం ప్రారంభించే సరికి నిశ్శబ్దంగా మారింది. ఆయన సమైక్యాంధ్రకు మద్దతు ఇస్తారనే ఉద్దేశంతో తెలుగుదేశం సీమాంధ్ర పార్లమెంటు సభ్యులు నినాదాలను ఆపేశారు. అయితే, తెలుగుదేశం పార్టీపై విమర్శలు ఎక్కుపెట్టే సరికి అభ్యంతరం తెలిపారు.












Click it and Unblock the Notifications