నేను తగను: లగడపాటి రాజకీయ సన్యాసం, ఎంపిగా..
న్యూఢిల్లీ: విజయవాడ పార్లమెంటు సభ్యులు లగడపాటి రాజగోపాల్ మంగళవారం తాను రాజకీయ సన్యాసం స్వీకరిస్తున్నట్లు ప్రకటించారు. ఈ రాజకీయాల్లో ఇమడలేకే తాను రాజకీయాల నుండి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. భారతదేశంలో నెలకొన్న ప్రస్తుత రాజకీయాలకు తాను తగనని, అందువల్లే తప్పుకుంటున్నానని ప్రకటించారు. లగడపాటి తన పార్లమెంటు సభ్యత్వానికి రాజీనామా కూడా చేశారు.
సమైక్య రాష్ట్రం కోసం తాను మొదటి నుండి తీవ్రంగా ప్రయత్నించానని లగడపాటి రాజగోపాల్ అన్నారు. భాషాప్రయుక్త రాష్ట్రంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ను కొందరి భావోద్వేగాలకు అనుగణంగా విభజన చేస్తున్నారని ధ్వజమెత్తారు. తాను పార్లమెంటు సభ్యుడిగా ఉండదల్చుకోలేదన్నారు. రాజకీయాల్లో కూడా కొనసాగదల్చుకోలేదని చెప్పారు. ప్రజాస్వామ్యంలో రాచరిక పోకడలు బాధాకరమన్నారు.
కాంగ్రెసును భూస్థాపితం చేయాలి: అశోక్ బాబు
లోకసభలో తెలంగాణ ముసాయిదా బిల్లున ఆమోదించిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెసు పార్టీని భూస్థాపితం చేయాల్సిందేనని ఎపిఎన్జీవో అధ్యక్షులు అశోక్ బాబు ప్రజలకు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో బిజెపికి బలం లేనందున ఆ పార్టీని పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. సమైక్యాంధ్ర కోసం ఎంపీలు, కేంద్రమంత్రులు చేసిన పోరాటంలో చిత్తశుద్ధి లేదని తాము చెప్పడం లేదని కానీ వారు ఆలస్యంగా స్పందించారన్నారు.