యోగీ సర్కార్ కు లఖీంపూర్ దెబ్బ-టెరాయ్ ప్రాంతంలో ఆరు జిల్లాలపై ప్రభావం-ఎన్నికల వేళ
యూపీలోని లఖీంపూర్ ఖేరీలో తాజాగా రైతులపై చోటు చేసుకున్న దాష్టికం యోగీ ఆదిత్యనాథ్ సర్కార్ పై తీవ్ర ప్రభావం చూపేలా కనిపిస్తోంది.ఇప్పటికే యూపీలో ప్రజావ్యతిరేకత ఎదుర్కొంటున్న యోగీ సర్కార్.. తాజా ఘటనతో తీవ్ర ఇబ్బందుల్లో పడింది. రైతులపై బీజేపీకి చెందిన కేంద్రమంత్రి కుమారుడి కారు దూసుకెళ్లిన ఘటన ఇప్పుడు యూపీలోని టెరాయ్ ప్రాంతంలో ఉన్న ఆరు జిల్లాల్లో బీజేపీ అవకాశాలపై తీవ్ర ప్రభావం చూపేలా కనిపిస్తోంది. వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఇక్కడ తీవ్ర ప్రజా వ్యతిరేకత ఎదుర్కోక తప్పేలా లేదు.

లఖీంపూర్ ఖేరీ వివాదం
యూపీలోని టెరాయ్ ప్రాంతం పరిధిలోకి వచ్చే లఖీంపూర్ ఖేరీలో వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా నిరసనలు చేపట్టిన రైతులపైకి కేంద్రమంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ కారు దూసుకెళ్లిన ఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారుతోంది. దీంతో లఖీంపూర్ ఖేరీ పేరు దేశంలోని పలు రాష్ట్రాల్లో మార్మోగుతోంది. అహింసా పద్ధతుల్లో నిరసన తెలుపుతున్న రైతులపైకి కేంద్రమంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రా ఉద్దేశపూర్వకంగానే కారుతో గుద్దినట్లు దాదాపుగా నిర్ధారణ కావడంతో పోలీసులు ఇప్పటికే ఆయనపై కేసు నమోదు చేశారు. దీంతో ఈ వివాదం క్షణానికో మలుపులు తిరుగుతోంది.

అఖిలేష్, ప్రియాంకల నిర్బంధం
లఖీంపూర్ ఖేరీలో రైతులపైకి బీజేపీ కేంద్రమంత్రి కుమారుడు కారు దూసుకెళ్లిన ఘటనకు నిరసనగా అక్కడికి వెళ్లేందుకు ప్రపయత్నించిన ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్, కాంగ్రెస్ యువ నేత ప్రియాంక గాంధీల్ని పోలీసులు అరెస్టు చేసి హౌస్ అరెస్టులో పెట్డడం ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతోంది. లఖీంపూర్ కు బయలుదేరిన ఛత్తీస్ ఘడ్ సీఎం భూపేష్ భగేల్ ను సైతం పోలీసులు లక్నో ఎయిర్ పోర్టులోనే అడ్డుకోవడం కూడా సంచలనం రేపుతోంది. దీంతో ఆయన ఎయిర్ పోర్టులోనే నిరసనకు దిగారు. విపక్షాలకు చెందిన కీలక నేతల్ని లఖీంపూర్ కు వెళ్లనీయకుండా అఢ్డుకునేందుకు పోలీసులు చేస్తున్న ప్రయత్నాలతో నిరసనల పర్వం మరింత పెరుగుతోంది.

టెరాయ్ ప్రాంతంపై ప్రభావం
రైతులపై బీజేపీ కేంద్రమంత్రి కుమారుడి దాష్టికం జరిగిన లఖీంపూర్ ఖేరీ లోక్ సభ సీటు టెరాయ్ ప్రాంతం పరిధిలోకి వస్తుంది. ఇక్కడ ఆరు జిల్లాలు ఉన్నాయి. ఇవన్నీ సిక్కు రైతుల ప్రభావం ఉండే జిల్లాలే. దీంతో ఇక్కడ లఖీంపూర్ ఘటనపై తీవ్ర నిరనసలు వ్యక్తమవుతున్నాయి. విపక్షాలు వీటికి సంఘీభావం ప్రకటిస్తుండంతో రైతులు కూడా వీరివైపు మొగ్గు చూపుతున్నారు. దీంతో టెరాయ్ పరిధిలోని ఆరుజిల్లాల్లో పరిస్ధితులు అదుపు తప్పే సూచనలు కనిపిస్తున్నాయి. రాజకీయంగా కూడా ఈ ప్రాంతంలో బీజేపీ అవకాశాలపై తీవ్ర ప్రభావం పడే ప్రమాదం కనిపిస్తోంది

యూపీ ఎన్నికలపై ప్రభావం తప్పదా ?
వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు ఎదుర్కొనేందుకు సిద్ధమవుతున్న యోగీ ఆదిత్యనాథ్ సర్కార్ కు లఖీంపూర్ ఖేరీ వ్యవహారం తలనొప్పిగా మారిపోయింది. ఇప్పటికే తీవ్ర ప్రజా వ్యతిరేకత కారణంగా యోగీ తన కేబినెట్ లో పలు మార్పులు చేశారు. అలాగే కేంద్ర కేబినెట్ విస్తరణలోనూ లఖీంపూర్ ఎంపీ అజయ్ మిశ్రా హోంశాఖ సహాయమంత్రి పదవి దక్కించుకున్నారు. దీంతో ఇప్పుడు ఆ మార్పుల కారణంగా కేంద్రమంత్రి అయిన అజయ్ మిశ్రా కుమారుడే ఇప్పుడు లఖీంపూర్ వివాదానికి కేంద్ర బిందువుగా మారిపోవడంతో యోగీ సర్కార్ తలపట్టుకుంటోంది. ఈ ఘటన టెరాయ్ పరిధిలోని 42 అసెంబ్లీ సీట్లపై ప్రభావం చూపుతుందని యోగీ సర్కార్ లో ఆందోళన వ్యక్తమవుతోంది. గత ఎన్నికల్లో ఈ 42 సీట్లలో బీజేపీ ఏకంగా 37 సీట్లు గెల్చుకుంది. ఈ సారి ఆ పరిస్ధితులు తలకిందులు కావడం ఖాయమనే భయాలు కాషాయ పార్టీని వెంటాడుతున్నాయి.












Click it and Unblock the Notifications