రైతులపైకి దూసుకెళ్లిన కేంద్రమంత్రి కాన్వాయ్ వాహనం: ఇద్దరు మృతి, 3 వాహనాలు దగ్ధం, ఉద్రిక్తత
లక్నో: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని లఖీంపూర్ ఖేరి జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిరసన తెలియజేస్తున్న రైతులపైకి కేంద్రమంత్రి కాన్వాయ్లోని ఓ వాహనం దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఇద్దరు రైతులు మరణించారని, పలువురు గాయపడ్డారని రైతులు తెలిపారు. దీంతో ఆ ప్రాంతం ఉద్రిక్తంగా మారింది.
లఖింపూర్ ఖేరి జిల్లా టికునియాలో ఓ ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొనేందుకు కేంద్రం హోంశాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా, డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య ఆదివారం హాజరయ్యారు. వీరి పర్యటనను నిరసిస్తూ ఉదయం నుంచి రైతులు నల్ల జెండాలు చూపిస్తూ ఆందోళన చేస్తున్నారు. ఈ క్రమంలో ఇరువర్గాల ఘర్షణ చెలరేగింది.

ఆ సమయంలోనే కేంద్రమంత్రి అజయ్ మిశ్రా, డిప్యూటీ సీఎం కేశవ్ మౌర్య ప్రయాణిస్తున్న కాన్వాయ్ రోడ్డు పక్కనే ఆందోళన చేస్తున్న రైతులపై దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఇద్దరు రైతులు మరణించారని, మరో 8 మంది గాయపడ్డారని సంయుక్త కిసాన్ మోర్చా వెల్లడించింది.
Recommended Video
కాగా, కారుతో రైతులను ఢీకొట్టిన ఘటనలో కేంద్రమంత్రి కుమారుడు ఆశిష్ మిశ్రా పేరు వినిపిస్తోంది. ఇద్దరు రైతులు మరణించడంతో రైతులు ఆందోళన ఉద్రిక్తంగా మారింది. ఆగ్రహించిన రైతులు మూడు వాహనాలను తగలబెట్టారు. దీంతో భారీ ఎత్తున పోలీసు బలగాలు మోహరించి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చాయి. రైతులపై కాన్వాయ్ దూసుకెళ్లిన ఘటనను సంయుక్త కిసాన్ మోర్చా నేత రాకేశ్ టికాయత్ ఖండించారు. ఎస్పీ నేత అఖిలేష్ యాదవ్ తోపాటు పలువురు రాజకీయ నాయకులు ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.












Click it and Unblock the Notifications