లఖింపూర్ ఖేరీ హింసాకాండ క్రైం బ్రాంచ్ పోలీసుల ముందు విచారణకు హాజరైన మంత్రి కుమారుడు ఆశిష్ మిశ్రా
లఖింపూర్ ఖేరి హింసాకాండ ఘటనలో కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రా ఈ రోజు విచారణకు హాజరయ్యారు. సుప్రీంకోర్టుతో సహా వివిధ వర్గాల ఒత్తిడి మేరకు లఖింపూర్ ఖేరీ హింస కేసులో ప్రధాన నిందితుడు ఆశిష్ మిశ్రా శనివారం ఉత్తరప్రదేశ్ క్రైమ్ బ్రాంచ్ ముందు హాజరయ్యారు. సుప్రీం ఆదేశాలతో గత బుధవారం ఉత్తర ప్రదేశ్ పోలీసులు విచారణకు హాజరు కావాలంటూ ఆశిష్ మిశ్రాకు సమన్లు జారీ చేసిన విషయం తెలిసిందే. లఖింపూర్ ఖేరి హింసాకాండ ఘటన జరిగిన తర్వాత అదృశ్యమైన ఆశిష్ మిశ్రా శనివారం ఉదయం యూపీ క్రైమ్ బ్రాంచ్ పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు.

లఖింపూర్ ఖేరి హింసాకాండలో మంత్రి కుమారుడు ఆశిష్ మిశ్రాపై ఆరోపణలు
కేంద్ర మంత్రి అజయ్ మిశ్రాతో పాటు ఓ కార్యక్రమంలో పాల్గొనడానికి వెళ్లిన యూపీ డిప్యూటీ సిఎం కేశవ్ ప్రసాద్ మౌర్య పర్యటనకు వ్యతిరేకంగా రైతులు ఆందోళన చేసిన విషయం తెలిసిందే. వారిని అడ్డుకునే ప్రయత్నం చేసిన రైతులపై ఒక్కసారిగా మంత్రి కాన్వాయ్ లోని వాహనం దూసుకుపోవడంతో నలుగురు రైతులు మరణించారు. అనంతరం జరిగిన హింసాకాండలో మరో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. రైతుల ఫిర్యాదు ఆధారంగా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు పోలీసులు. ఈ ఘటనకు కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రా కారణమని, ఆశిష్ మిశ్రా వాహనమే రైతులపై నుండి దూసుకుపోయింది అని రైతులు ఆరోపించారు.

నోటీసును గౌరవిస్తాం, దర్యాప్తుకు సహకరిస్తామన్న ఆశిష్ మిశ్రా
ఆశిష్ మిశ్రా పై హత్య, నేరపూరిత కుట్ర మరియు అల్లర్లు మొదలైన ఐపిసిలోని వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఈ క్రమంలో ఆశిష్ మిశ్రా లఖింపూర్ ఖేరీ పట్టణంలోని క్రైమ్ బ్రాంచ్ ముందు ఈరోజు హాజరయ్యారు. తాము నోటీసును గౌరవిస్తామని, దర్యాప్తులో సహకరిస్తామని వెల్లడించారు. శనివారం ఆశిష్ మిశ్రా క్రైమ్ బ్రాంచ్ పోలీసుల ముందు హాజరు అయ్యే క్రమంలో ఆయన నివాసం వద్ద మరియు లఖింపూర్ ఖేరి వెలుపల పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు.

క్రైం బ్రాంచ్ పోలీసుల ముందు హాజరైన ఆశిష్ మిశ్రా
ఇదిలా ఉంటే శుక్రవారం నాడు ఐదు రోజుల తర్వాత కూడా ఆశిష్ని అరెస్ట్ చేయకపోవడంపై సుప్రీంకోర్టు యూపీ ప్రభుత్వాన్ని నిలదీసింది. గురువారం యుపి పోలీసులు అందించిన మొదటి సమన్కు ప్రతిస్పందనగా ఆశిష్ మిశ్రా శుక్రవారం హాజరు కాలేదు. లఖింపూర్లో శనివారం ఉదయం 11 గంటల వరకు ఆశిష్ను క్రైమ్ బ్రాంచ్ ముందు విచారణకు హాజరుపరచాలని పోలీసు అధికారులు శుక్రవారం రెండో సమన్ని జారీ చేశారు . ఇదిలా ఉంటే కేంద్ర మంత్రి కుమారుడు ఆశిష్ మిశ్రా పోలీసుల ముందు విచారణకు హాజరుకాకపోవడంపై స్పందించారు.

కుమారుడు ఆశిష్ మిశ్రాపై ఆరోపణలను ఖండించిన కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా
కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా తన కుమారుడు అనారోగ్య కారణాల వల్ల హాజరు కాలేదని స్పష్టం చేశారు. ఆశిష్ మిశ్రా నేపాల్కు పారిపోయాడని, తరచూ తన లొకేషన్ మారుస్తున్నాడని మీడియాలో వచ్చిన వార్తలను ఖండించిన మంత్రి అజయ్ మిశ్రా తన కుమారుడు లఖింపూర్ ఖేరిలో ఇంట్లో ఉన్నారని, శనివారం పోలీసుల ఎదుట హాజరవుతారని పేర్కొన్నారు. ఈ రోజు పోలీసుల ముందు విచారణకు హాజరైన క్రమంలో ఆశిష్ మిశ్రా ఏం చెప్పబోతున్నారు అన్నది తెలియాల్సి ఉంది. అయితే ఇప్పటికే తన కుమారుడు ఘటన జరిగిన సమయంలో వాహనంలో లేడని మంత్రి చెప్పిన క్రమంలో విచారణలో ఇదే చెప్తారని తెలుస్తుంది.












Click it and Unblock the Notifications