Munni Rajak : బీహార్లో చాకలి మహిళను ఎమ్మెల్సీని చేసిన ఆర్జేడీ- ఎవరీ మున్నీ రజక్ ?
కులాల ప్రభావం అధికంగా ఉండే బీహార్లో తాజాగా జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆర్జేడీ నిలబెట్టిన అభ్యర్దులు రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారారు. ముఖ్యంగా చాకలి మహిళ మున్నీ రజక్ ను పెద్దల సభకు పంపాలన్న ఆర్జేడీ నిర్ణయం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది. దీంతో ఇప్పుడు ఆర్జేడీ ఎంపిక ఇతర రాష్ట్రాల్లోనూ చర్చకు దారి తీసింది.
బీహార్లో తాజాగా జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏడుగురు అభ్యర్ధులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వీరిలో ఆర్జేడీ తరఫున ముగ్గురు అభ్యర్దులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వీరిలో మున్నీ రజక్ కూడా ఒకరు. అలాగే జేడీయూ, బీజేపీ తరఫున తలో ఇద్దరు అభ్యర్ధులు కూడా ఏకగ్రీవమయ్యారు. పంచాయతీ కోటాలో ఆయా పార్టీలకు ఉన్న బలాల ఆధారంగానే అభ్యర్ధుల్ని నిలబెట్టడంతో పోటీ లేకపోయింది. అయితే ఆర్జేడీ నిలబెట్టిన మున్నీ రజక్ పైనా అందరి దృష్టీ నెలకొంది.

బీహార్లో ఆర్జేడీ తరఫున గత 20 ఏళ్లుగా జెండా మోస్తున్న రజక మహిళ మున్నీ రజక్ కు లాలూ ప్రసాద్ కుటుంబం అంటే ఎంతో ఇష్టం. గత 15 ఏళ్లలో ఆర్జేడీ నిర్వహించిన ప్రతీ ఆందోళనలోనూ, కార్యక్రమాల్లోనూ మున్నీ రజక్ క్రమం తప్పకుండా పాల్గొంది. ఇన్నాళ్లకు ఆమె శ్రమ ఫలించింది. గతంలో ఎన్డీయేకు వ్యతిరేకంగా బీహార్లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో స్టేజ్ పై పాట పాడిన మున్నీ రజక్ ను లాలూ తొలిసారి గుర్తించారు.

2019లో లాలూ ఆస్పత్రిలో ఉన్నప్పుడు ఆయన్ను కలవనీయకుండా పోలీసులు అడ్డుకున్నప్పుడు మున్నీ రజక్ గుండెలు బాదుకున్న దృశ్యాల్ని అక్కడి టీవీ ఛానళ్లు ప్రసారం చేశాయి. దీంతో ఆమె ఒక్కసారిగా పాపులర్ అయిపోయారు. దీంతో తాజాగా బీహార్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆర్జేడీ ఆమెను ఎంపిక చేసింది. ఎన్నికలు ఏకగ్రీవం కావడంతో ఆమె నేరుగా ఎమ్మెల్సీగా విధాన సభలో అడుగుపెట్టడబోతున్నారు. సామాన్యుల సమస్యలపై తాను పోరాటం చేస్తానని మున్నీ రజక్ చెప్తున్నారు.












Click it and Unblock the Notifications