మాంఝీ బీజేపీకి వ్యతిరేకంగా మాతో కలువు: లాలూ, నితీష్ అప్సెట్
బీహార్: జనతా పార్టీలో మరోసారి విభేదాలు కనిపించాయి. బీహార్ మాజీ ముఖ్యమంత్రి జీతన్ రామ్ మాంఝీ తమతో చేతులు కలపాలని ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ పిలుపునిచ్చారు. దీంతో జేడీ(యూ) వర్గాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. లాలూ తీరుపై అప్ సెట్ అయ్యాయి.
ఇప్పటికే త్వరలో జరగనున్న బీహార్ ఎన్నికల కోసం ఇరు పార్టీల మధ్య సీట్ల విషయం చర్చనీయాంశమైంది. బీజేపీని ఎదుర్కొనేందుకు ములాయం నేతృత్వంలో ఆరు పార్టీలు ఒక్కటైన విషయం తెలిసిందే. అందులో బీహార్లో కీలకంగా, రెండు దశాబ్దాలుగా శత్రువులుగా ఉన్న ఆర్జేడీ (లాలూ), జేడీయు (నితీష్) ఒక్కటయ్యారు.
కానీ, వారి మధ్య ఏమాత్రం పొసగడం లేదు. జనతా పరివార్ విలీనంలో ఎదురౌతున్న ఇబ్బందులను తొలగించుకోవడానికి భాగస్వామ్య పక్షాలన్నీ శుక్రవారం మరోసారి సమావేశం అవుతున్న తరుణంలో బీజేపీకి వ్యతిరేకంగా ఏర్పాటుకానున్న మహాకూటమిలో చేరాలంటూ బీహార్ మాజీ సీఎం మంఝీని ఆహ్వానించి లాలూ జెడి(యు) వర్గాల ఆగ్రహానికి గురయ్యారు.

బీహార్ ప్రస్తుత ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ బద్ధ విరోధి అయిన మంఝీ ముఖ్యమంత్రి పదవి నుంచి దింపేసిన తర్వాత హిందుస్థానీ అవామ్ పార్టీ పేరిట కొత్త పార్టీని ఏర్పాటు చేయడమే కాక బీజేపీకి దగ్గరవడానికి ప్రయత్నిస్తున్నట్లు వార్తలు రావడం తెలిసిందే.
బీజేపీకి వ్యతిరేకంగా మహా కూటమిని ఏర్పాటు చేయాలన్నది తమ లక్ష్యమని, మాంఝీ సహా ప్రతి ఒక్కరూ దీనికోసం తమతో చేతులు కలపడానికి ముందుకు రావాలని శుక్రవారం జరిగే జనతా పరివార్ భాగస్వామ్య పక్షాల సమావేశంలో పాల్గొనడానికి గురువారం ఢిల్లీ బయలుదేరడానికి ముందు విలేకరులతో లాలూ అన్నారు.
విలీనం లేదా పొత్తు ఏదైనా, బీజేపీకి వ్యతిరేకంగా పోరాడడానికి పార్టీల మధ్య ఐక్యత అవసరమని, మాంఝీ తదితరులు ఇందుకు ముందుకు రావాలన్నారు. లాలూ వ్యాఖ్యలపై స్పందించడానికి సీఎం నితీశ్ కుమార్ నిరాకరించారు.
అయితే వచ్చే ఏడాది చివర్లో జరగనున్న బీహార్ అసెంబ్లీకి ముందే జనతా పరివార్ భాగస్వామ్య పక్షాల విలీనాన్ని పూర్తి చేయాలని తొందరపడుతున్న జేడీ(యు) వర్గాలు మాత్రం లాలూ వ్యాఖ్యలపై మండిపడ్డాయి. బీజేపీకి దగ్గరైన మంఝీని కూటమిలోకి ఆహ్వానించే ప్రసక్తే లేదని బీహార్ జెడి(యు) అధ్యక్షుడు బశిష్ట నారాయణ్ సింగ్ అన్నారు.












Click it and Unblock the Notifications