ఎన్నికల్లో అనర్హత: జైలు శిక్షపై హైకోర్టుకు లాలూ ప్రసాద్
రాంచీ: దాణా కుంభకోణం కేసులో ఆర్జేడి అధినేత, బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ గురువారం జార్ఖండ్ హైకోర్టును ఆశ్రయించారు. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ) తీర్పును ఆయన రాష్ట్ర ఉన్నత న్యాయస్థానంలో సవాల్ చేశారు.
సిబిఐ కోర్టు తీర్పును తాము హైకోర్టులో సవాల్ చేశామని, బెయిల్ ఇవ్వాలని, పెనాల్టీ తదితర అంశాల పైన తాము హైకోర్టును ఆశ్రయించామని లాలూ ప్రసాద్ యాదవ్ కౌన్సెల్ చిత్తరంజన్ చెప్పారు. లాలూకు న్యాయస్థానం ఐదేళ్ల జైలు శిక్ష విధించడంతో అతను పదకొండేళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హులయ్యారు. ప్రస్తుతం లాలూ బిర్సాముండా సెంట్రల్ జైలులో ఉన్నారు.
కాగా, దాణా కుంభకోణం కేసులో లాలూ ప్రసాద్ యాదవ్కు రాంచీ సిబిఐ ప్రత్యేక కోర్టు అక్టోబర్ రెండున ఐదేళ్ల జైలు శిక్షను విధించిన విషయం తెలిసిందే. ఇదే కేసులో మరో మాజీ ముఖ్యమంత్రి జగన్నాథ మిశ్రాకు నాలుగేళ్ల జైలు శిక్షను విధించింది. లాలూకు కోర్టు రూ.25 లక్షల జరిమానా కూడా విధించింది. ఈ తీర్పుపై హైకోర్టుకు వెళ్తామని ఆర్జేడి అప్పుడే చెప్పింది.
లాలూ ప్రసాద్ యాదవ్ బీహార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పశువుల దాణాకు సంబంధించి రూ.35 కోట్ల రూపాయలు కాజేశారనే అభియోగంపై సిబిఐ విచారణ చేపట్టింది. పదహారేళ్లుగా ఈ కేసు విచారణ సాగింది.