ఫోన్లో లాలు మంతనాలు : బ్యారెక్ తనిఖీ, లభించని రుజువులు
రాంచీ : ఎన్నికల వేళ జైల్లో ఉన్న నేతలపై నిఘాపెట్టారు పోలీసులు. కారాగార శిక్ష అనుభవిస్తోన్న నేతలు .. ఎవరితోనైనా సంప్రదింపులు జరుపుతారనే సమాచారంతో డేగ కళ్లతో పర్యవేక్షిస్తున్నారు. పశు దాణా కుంభకోణంలో కేసులో జైలుశిక్ష అనుభవిస్తోన్న ఆర్జేడీ అధినేత లాలు ప్రసాద్ యాదవ్ .. తన అనుచరులతో ఫోన్లో మాట్లాడుతున్నారనే వార్తలు గుప్పుమనడంతో ... ఆయన వార్డును తనిఖీ చేశారు.
రైడ్స్ .. లాలు అలర్ట్ ...
తాను జైలులో ఉన్న అనుచరులతో లాలుప్రసాద్ యాదవ్ మంతనాలు జరుపుతున్నట్టు వార్తలు గుప్పుమన్నాయి. దీంతో లాలుప్రసాద్ యాదవ్ ఉండే బ్యారక్లో రాంచీ జిల్లా పోలీసులతో కలిసి బిస్రాముండా జైలు అధికారులు తనిఖీలు చేపట్టారు. పోలీసులు వచ్చి తనిఖీలు చేపడుతారనే సమాచారం ఉందో తెలియదు కానీ .. లాలు బ్యారెక్లో పోలీసులకు ఫోన్ కాదు కదా .. అనుమనించదగ్గ వస్తువు ఏదీ దొరకలేదు. జైలులో సాధారణంగా చేసే తనిఖీల మాదిరిగానే లాలు బ్యారక్ చెక్ చేసినట్టు డీఎస్పీ దీపక్ కుమార్ పాండే తెలిపారు.
ఫోన్ వాడారు .. అబ్బే అదేం లేదు ...
లాలుప్రసాద్ యాదవ్ బ్యారెక్లో తనిఖీలు జరిపిన వెంటనే బీహార్ సీఎం నితీశ్ కుమార్ స్పందించారు. తన సహచరులతో లాలు మంతనాలు జరుపుతున్నారని ఆన ఆరోపించారు. జైలులో ఉండి ఫోన్లో సలహాలు ఇస్తున్నారని, ఇది జైలు నియమాలను ఉల్లంఘించడం కిందకే వస్తుందని పేర్కొన్నారు. అయితే నితీశ్ కుమార్ ఆరోపణలు ఆర్జేడీ తోసిపుచ్చింది. లాలుప్రసాద్ బ్యారెక్లో తనిఖీలు చేసినప్పుడు జైలు అధికారులకు అనుమానిత వస్తువు ఏమీ లభించలేదు, కానీ నితీశ్ పాట్నాలో కూర్చొని ఎలా అసత్య ఆరోపణలు చేస్తారని ఆర్జేడీ బీహార్ చీఫ్ మనోజ్ కుమార్ మండిపడ్డారు. జైలు నియమాల ప్రకారం ఓ ఖైదీని కలిసేందుకు వారంలో ఒకరోజు అనుమతి ఉంటుందని పేర్కొన్నారు. నిన్ననే కాదు .. జనవరి 2న కూడా తనిఖీలు చేపట్టారని గుర్తుచేశారు.
ఫోన్లో గైడెన్స్ ...
బీహార్, జార్ఖండ్లో మహాకూటమి కలిసి పోటీచేయడంలో లాలుప్రసాద్ యాదవ్ కీలకపాత్ర పోషించారు. లాలు ఆదేశానుసారమే బీహార్, జార్ఖండ్లో ఆ పార్టీ కాంగ్రెస్తో పొత్తు పెట్టుకుందని ఆరోపణలు వచ్చాయి. జైలులో ఉన్న లాలుప్రసాద్ యాదవ్ తమ అనుచరులతో మంతనాలు జరిపారనే విమర్శలు వినిపించాయి. ఈ నేపథ్యంలోనే లాలు బ్యారెక్లో తరచుగా పోలీసులు తనిఖీలు చేపడుతున్నారు.
దాణా మేసి, జైలుకు ...
పశుదాణా కుంభకోణం కేసులో స్పెషల్ సీబీఐ కోర్టు లాలుప్రసాద్ యాదవ్ను దోషిగా తేల్చి .. జైలుశిక్ష విధించిన సంగతి తెలిసిందే. 2017 డిసెంబర్ నుంచి బిస్రాముండా జైలులో లాలు శిక్ష అనుభవిస్తున్నారు. ఇటీవల ఆరోగ్య సమస్యలతో రిమ్స్ ఆస్పత్రిలో లాలు చేరి చికిత్స కూడా తీసుకుంటున్నారు.