21 రోజుల లాక్డౌన్ చివరిరోజు..ప్రధాని ఏం చెబుతారు?: మరి కాస్సేపట్లో వీడనున్న ఉత్కంఠత
న్యూఢిల్లీ: కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని నియంత్రించడానికి దేశవ్యాప్తంగా అమలు చేస్తోన్న లాక్డౌన్ చివరిరోజుకు చేరుకుంది. యావత్ భారతదేశ ప్రజల స్వీయ గృహనిర్బంధం మంగళవారం నాటితో ముగియబోతోంది. ప్రజలు నిర్బంధంలో ఉన్నప్పటికీ.. దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గలేదు. ఫలితంగా- ఇప్పటికే పలు రాష్ట్రాలు లాక్డౌన్ను ఈ నెల 30వ తేదీ వరకూ పొడిగించుకున్నాయి..తెలంగాణ సహా.
హాట్స్పాట్గా హైదరాబాద్: తెలుగు రాష్ట్రాలపై విరుచుకుపడుతున్న కరోనా: 1000 పైగా పాజిటివ్
ఈ పరిస్థితుల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జాతిని ఉద్దేశించి ప్రసంగించబోతున్నారు. ఈ ఉదయం 10 గంటలకు ఆయన దేశ ప్రజల ముందుకు రానున్నారు. లాక్డౌన్పై ప్రధాని ఏం చెబుతారు? ఎలాంటి సందేశాన్ని ఇస్తారనే ఉత్కంఠతకు మరి కాస్సేపట్లో తెర పడబోతోంది. లాక్డౌన్ కొనసాగించడంపై ఈ నెల 11వ తేదీన ప్రధాని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ను నిర్వహించారు. వారి అభిప్రాయాలను తీసుకున్నారు.
లాక్డౌన్ పొడిగింపుపై ఈ వీడియో కాన్ఫరెన్స్లో భిన్న స్వరాలు వినిపించిన విషయం తెలిసిందే. కొన్ని రాష్ట్రాలు పొడిగింపు వైపు మొగ్గు చూపగా.. మరి కొన్ని పాక్షికంగా సడళించడాన్ని ఆశించాయి. రెడ్జోన్లు, హాట్స్పాట్లకు మాత్రమే పరిమతం చేసేలా లాక్డౌన్ను పొడిగించాలనే అభిప్రాయాన్ని వెల్లడించాయి. ఈ భేటీ తరువాత ప్రధాని నిర్ణయంలో మార్పు వచ్చిందని తెలుస్తోంది. అందుకే- స్మార్ట్ లాక్డౌన్ విధానాన్ని తెర మీదికి తీసుకుని రావచ్చని చెబుతున్నారు.
కరోనా వైరస్ లేని ప్రాంతాల్లో పాక్షికంగా లాక్డౌన్ను సడలించడం వల్ల కొంతవరకైనా వ్యాపార కార్యకలాపాలు పునఃప్రారంభమౌతాయని, పరిశ్రమలను పునరుద్ధరించడానికి వీలు ఉంటుందని అంటున్నారు. ఫలితంగా- ఆర్థిక వెసలుబాటు ఉండే అవకాశం లేకపోలేదని, దీన్ని దృష్టిలో ఉంచుకునే దేశాన్ని రెడ్, ఆరెంజ్, గ్రీన్ జోన్లుగా విభజించిన ప్రతిపాదనలను తీసుకొచ్చారనే చర్చ దేశవ్యాప్తంగా కొనసాగుతోంది.
Recommended Video