పౌరసత్వ సవరణ బిల్లుపై అధికార పార్టీ నేతల రాజీనామాలు
గౌహతి: పౌరసత్వ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా అస్సాంలో నిరసనలు మిన్నంటుతున్నాయి. రోజురోజుకూ ఈ ఆందోళనలు తీవ్రతరం అవుతున్నాయి. ఈ క్రమంలోనే అధికార బీజేపీ మరియు అస్సోం గనపరిషత్ పార్టీలకు చెందిన నాయకులు తమ పదవులకు రాజీనామా చేయడం చర్చనీయాంశమైంది. రాష్ట్ర ప్రజల యొక్క ఆంకాక్షను పరిరక్షించడంలో ప్రభుత్వం విఫలమైందని చెబుతూ వారు తమ పదవులకు రాజీనామా చేశారు.

రాజీనామా చేసిన సీనియర్ నేత జగదీష్ భుయాన్
సీనియర్ బీజేపీ నాయకుడు, ప్రభుత్వ రంగ సంస్థ అయిన అస్సాం పెట్రోకెమికల్స్ లిమిటెడ్ ఛైర్మెన్ జగదీష్ భుయాన్ పార్టీకి పదవికి రాజీనామా చేశారు. సవరణ చేసిన పౌరసత్వ బిల్లు అస్సాం ప్రజలకు వ్యతిరేకంగా ఉందని చెప్పారు. అందుకే తాను రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించి వెంటనే ప్రజల పక్షాన నిలిచి పోరాటం చేస్తానని వెల్లడించారు. అంతకుముందు అస్సాం స్టేట్ ఫిల్మ్ ఫైనాన్స్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మెన్ పదవికి అస్సాం నటుడు జతిన్ బోరా రాజీనామా చేశారు. మరో బీజేపీ నేత రవిశర్మ కూడా రాజీనామా చేసి ఆందోళనల్లో పాల్గొన్నారు. తాను ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నానంటే అందుకు కారణం అస్సాం ప్రజలు తనపై చూపిన ప్రేమ ఆప్యాయతలే అని చెప్పిన జతిన్ బోరా... అందుకే రాజీనామా చేసి ప్రజల పక్షాన నిలవాలని భావించినట్లు చెప్పారు.

రాజీనామా చేసేందుకు వెనకాడను: పద్మహజారికా
మరోవైపు అసెంబ్లీ మాజీ స్పీకర్ పులకేశ్ బరువా కూడా బీజేపీకి రాజీనామా చేస్తున్నట్లు శుక్రవారం ప్రకటించారు. ఇక జాముగురిహత్ నియోజకవర్గం బీజేపీ ఎమ్మెల్యే పద్మ హజారికా కూడా రాజీనామా చేసేందుకు సిద్ధం అయ్యారు. పౌరసత్వ సవరణ బిల్లుపై తన నియోజకవర్గ ప్రజలు ఆందోళనలు చేస్తున్నారని వారు తన రాజీనామా కోరితే వెంటనే చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. ఇక బ్రహ్మపుత్ర వ్యాలీలో పౌరసత్వ సవరణ బిల్లు అమలుపై ప్రభుత్వం మరోసారి పునఃసమీక్షించాలని స్పీకర్ హితేంద్రనాథ్ గోస్వామి కోరారు. ఇలానే కొనసాగితే ఆందోళనలు హింసాత్మకంగా మారుతాయని కొన్ని అసాంఘిక శక్తులు దీన్ని అదనుగా తీసుకుని అరాచకాలు సృష్టిస్తాయని హెచ్చరించారు. పౌరసత్వ సవరణ బిల్లు వివిధ మతాల వారి మధ్య విబేధాలు సృష్టిస్తుందని అభిప్రాయపడ్డారు.

మిన్నంటుతున్న ఆందోళనలు
అస్సాం ప్రజల మనోభావాలకు వ్యతిరేకంగా పౌరసత్వ సవరణ బిల్లు ప్రభుత్వం తీసుకురావడాన్ని చాలామంది బీజేపీ సీనియర్ నేతలు వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. అస్సాంలోని కొన్ని అటానమస్ జిల్లాల్లో మాత్రమే పౌరసత్వ సవరణ బిల్లు అమలులో ఉండదు. ఇందులో గిరిజన జిల్లాలే ఎక్కువగా ఉన్నాయి. ఈ జిల్లాల్లోకి చాలా తక్కువ మంది బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వలసదారులు ఉన్నారు. ఎక్కువ వలసదారులు వచ్చి సెటిల్ అయిన జిల్లాల్లో పౌరసత్వ సవరణ చట్టం కవర్ అవుతుంది. ఇదిలా ఉంటే జిల్లా స్థాయిలో ఏజీపీ నేతలు పార్టీకి రాజీనామా చేశారని పార్టీ ప్రకటన విడుదల చేసింది. ఒకప్పుడు అక్రమ వలసదారులపై పోరాడి ఆ తర్వాత పార్టీగా ఏజీపీ అవతరించిందన్న విషయాన్ని గుర్తుచేస్తున్నారు. అందుకే స్థానిక నేతలు చాలామంది రాజీనామా చేశారని పార్టీ సీనియర్ నేత ఒకరు చెప్పారు.

బయట వ్యక్తులే హింసకు పాల్పడుతున్నారు: బీజేపీ చీఫ్
ఇదిలా ఉంటే ఆందోళనలను బీజేపీ ఖండించింది. కొందరు బయట వ్యక్తులు ఈ ఆందోళనలు చేస్తున్నారని ఆరోపించారు అస్సాం బీజేపీ చీఫ్ రంజిత్ కుమార్ దాస్. పౌరసత్వ సవరణ బిల్లు పేరుతో కొందరు కావాలనే హింసను ప్రోత్సహిస్తున్నారని చెప్పిన రంజిత్ కుమార్ దాస్... ఈ ఆందోళనలకు ఆల్ అస్సాం స్టూడెంట్స్ యూనియన్ మరియు ఇతర స్థానిక సంఘాలది బాధ్యత కాదని స్పష్టం చేశారు. ఇక అస్సాంలో జరుగుతున్న హింసకు కారణం కాంగ్రెస్ అని రంజిత్ కుమార్ దాస్ ధ్వజమెత్తారు. మరోవైపు బీజేపీ అస్సాంకు వ్యతిరేకంగా ఉందని ఆరోపించారు కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్. ఏజీపీ కూడా ఈ పాపంలో భాగమే అని చెప్పిన గౌరవ్ గొగోయ్... అస్సాం ప్రజలు వీరిని క్షమించరని అన్నారు. ప్రజల పక్షాన ఉండి కాంగ్రెస్ పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications