Disha Murder case:రాత్రివేళ మహిళలకు పోలీసు వాహనాల్లో ఇంటి వద్ద డ్రాప్: పురుడు పోసుకున్న స్కీం..!
చండీగఢ్: హైదరాబాద్ కు చెందిన వెటర్నరి డాక్టర్ దిశా హత్యోదంతం అనంతరం.. దేశవ్యాప్తంగా మహిళల భద్రతపై ఆయా ప్రభుత్వాలు, పోలీసు యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించాయి. ఆపదలో ఉన్నట్లు సమాచారం అందిన ఏడు సెకెన్లలో మహిళలకు రక్షణ కల్పించేలా ఏర్పాట్లు చేస్తుండగా.. పంజాబ్ ప్రభుత్వం కూడా అదే దిశలో సరి కొత్త పథకానికి తెర తీసింది. లూధియానాలో ప్రయోగాత్మకంగా ఈ పథకాన్ని ప్రవేశ పెట్టింది.

లూధియానాలో ప్రయోగాత్మకంగా..
రాత్రివేళల్లో విధులను ముగించుకుని ఇంటికి వెళ్లే సమయంలో మహిళా ఉద్యోగులకు క్యాబ్ లు అందుబాటులోకి రాకపోతే..పోలీసు జీపుల్లో ఉచిత రవాణా వసతిని కల్పించాలని పంజాబ్ లోని అమరీందర్ సింగ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మహిళా ఉద్యోగులకు మాత్రమే కాకుండా.. విద్యార్థినులు, ఒంటరి మహిళలకు ఈ పథకాన్ని వర్తింపజేస్తోంది. దీనికోసం ప్రత్యేకంగా ఓ హెల్ప్ లైన్ సెంటర్ ను ఏర్పాటు చేసింది. ఈ హెల్ప్ లైన్ ఫోన్ నంబర్లు.. 1091 లేదా 7837018555.

రాత్రి 10 నుంచి తెల్లవారు జామున 6 గంటల వరకు
రాత్రి 10 గంటల నుంచి తెల్లవారు జామున 6 గంటల వరకు ఈ ఉచిత పోలీసు జీపు పథకం అందుబాటులో ఉంటుందని లూధియానా పోలీసు కమిషనర్ రాకేష్ అగర్వాల్ వెల్లడించారు. క్యాబ్ లు అందుబాటులో లేకపోయినా, తాము నివసిస్తోన్న ప్రదేశానికి రావడానికి క్యాబ్ డ్రైవర్లు గానీ, ట్యాక్సీ డ్రైవర్లు గానీ నిరాకరించినా.. మహిళలు వెంటనే తమ హెల్ప్ లైన్ సెంటర్ కు ఫోన్ చేయాలని సూచించారు.

హెల్ప్ లైన్ టు పోలీస్ స్టేషన్..
1091 లేదా 7837018555 నంబర్లకు ఫోన్ చేసి, తాము ఉన్న ప్రదేశం గురించి వివరిస్తే.. సంబంధిత పోలీస్ స్టేషన్ కు హెల్ప్ లైన్ నుంచి సమాచారాన్ని చేరవేస్తామని అన్నారు. పోలీస్ స్టేషన్ నుంచి కానిస్టేబుల్ అందుబాటులోకి వస్తారని, మహిళలను వారి ఇంటి వద్దకు పోలీసు జీపులో చేరుస్తారని వివరించారు. ఈ సౌకర్యాన్ని ప్రయోగాత్మకంగా ప్రవేశ పెట్టామని, ఇది విజయవంతమైతే.. రాష్ట్రంలోని అన్ని ప్రధాన నగరాల్లో ప్రవేశ పెట్టనున్నట్లు చెప్పారు.

28 జీపులు, 110 మోటార్ సైకిళ్లు..
ప్రస్తుతం లూధియానా పోలీస్ కమిషనరేట్ పరిధిలో 28 పోలీసు జీపులు, 110 మోటార్ సైకిళ్లు, 10 వ్యాన్లు అందుబాటులో ఉన్నాయి. మహిళలకు ఉచితంగా రవాణా వసతిని కల్పించడానికి ఆయా వాహనాలను వినియోగిస్తామని రాకేష్ అగర్వాల్ తెలిపారు. అదనంగా మరి కొన్ని వాహనాలను సమకూర్చుకోవడానికి అనుమతి ఇవ్వాలని తాము హోం మంత్రిత్వ శాఖకు ప్రతిపాదనలను పంపించామని తెలిపారు. ప్రభుత్వం అనుమతి ఇస్తే.. మరిన్ని వాహనాలను అందుబాటులోకి తెస్తామని చెప్పారు.

దిశా ఉదంతంతో..
హైదరాబాద్ లో వెటర్నరి డాక్టర్ దిశ హత్యోదంతం తమ దృష్టికి వచ్చిందని రాకేష్ అగర్వాల్ తెలిపారు. ఈ హత్యోదంతం పంజాబ్ పోలీసు శాఖను దిగ్భ్రాంతికి గురి చేసిందని, మరో నిర్భయ ఉదంతాన్ని తలపించిందని ఆయన చెప్పారు. తమ రాష్ట్రంలో ఆ తరహా ఉదంతాలు చోటు చేసుకోనివ్వకుండా అన్ని జాగ్రత్తలను తీసుకుంటామని అన్నారు. ఇందులో భాగంగానే.. పోలీసు జీపుల ద్వారా ఉచిత రవాణా వసతిని కల్పించినట్లు తెలిపారు.












Click it and Unblock the Notifications