లెఫ్ట్ టు రైట్: జీఎస్టీ రూపకల్పనలో వీరే కీలకం
న్యూఢిల్లీ: దాదాపు 17 ఏళ్ల క్రితం వస్తు సేవల పన్ను(జీఎస్టీ)కి అంకురార్పణ జరిగింది. ఇప్పటివరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలుచేస్తున్న సంక్లిష్ట పన్నుల విధానాన్ని సరళతరంచేస్తూ ఉమ్మడి పన్ను విధానం అమలులోకి రానున్నది. 175 మంది అధికారులు గత ఆరునెలల్లో 18 వేల గంటలకు పైగా అహర్నిశలు శ్రమించి నాలుగు జీఎస్టీ బిల్లులను తయారు చేశారు. ప్రస్తుత బడ్జెట్ సమావేశాల్లో పార్లమెంట్లో ప్రభుత్వం ప్రవేశపెట్టేందుకు తమ వంతు సహకారం అందించారు. దేశంలోనే అత్యంత కీలకమైన పన్నుల సంస్కరణల ప్రక్రియ కీలక దశకు చేరుకున్నది. సుదీర్ఘ కఠోర శ్రమ వెనుక నలుగురు ప్రముఖుల పాత్ర ఉన్నది. పశ్చిమ బెంగాల్ మాజీ ఆర్థికశాఖ మంత్రి అసిందాస్ గుప్తా మొదలు ప్రస్తుత కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ వరకు విధి విధానాల రూపకల్పనలో కీలకంగా వ్యవహరించారు.
అసిందాస్ గుప్తా ఇలా..
సరిగ్గా 17 ఏళ్ల క్రితం 2000లో నాటి వాజ్పేయి ప్రభుత్వం.. జీఎస్టీ ఏర్పాటు కోసం నిపుణుల కమిటీ ఏర్పాటు చేసింది. నాటి పశ్చిమ బెంగాల్ ఆర్థిక శాఖ మంత్రి అసిందాస్ గుప్తా సారధ్యంలో నిపుణుల కమిటీని ఏర్పాటు చేశారు. కొన్నేళ్ల తర్వాత అసిందాస్ గుప్తా.. జీఎస్టీ సాధికారత కోసం ఏర్పాటైన జీఎస్టీ సాధికారత కమిటీకి చైర్మన్గా వ్యవహరించారు. మార్క్సిస్టు పార్టీ నాయకుడిగా మారిన ఎంఐటి ప్రొఫెసర్ అసిందాస్ గుప్తా వివిధ రాష్ట్రాల ఆర్థిక మంత్రులు, వాణిజ్య వ్యాపార సంస్థల ప్రతినిధులతో, ఇతర భాగస్వాములతో సంప్రదింపులు జరిపారు. జీఎస్టీ మోడల్ విధి విధానాల రూపకల్పనలో కీలక పాత్ర పోషించారు.
ప్రతిపాదించిందీ విజయ్ కేల్కర్
2003లో ఫిస్కల్ రెస్పాన్సిబిలిటీ మేనేజ్మెంట్ యాక్ట్, 2003 రూపకల్పనలోనూ, అమలులో కీలక పాత్ర పోషిస్తున్న కేల్కర్ టాస్క్ఫోర్స్ కమిటీకి సారథ్యం వహించిన విజయ్కేల్కర్ కూడా జీఎస్టీ అమలులో ముఖ్యమైన వ్యక్తిగా నిలిచారు. విలువ ఆధారితంతోపాటు సమగ్ర పన్ను విధానం ‘వస్తు సేవల పన్ను' ఉండాలని ఆకాంక్షించిన వారిలో విజయ్ కేల్కర్ ఒకరు. 13వ ఆర్థిక సంఘం చైర్మన్గా విజయ్ కేల్కర్ సారథ్యం వహించారు. ఆయన జీఎస్టీ కోసం ఆయన పని చేశారు. జాతీయ స్థాయిలో జీఎస్టీ కౌన్సిల్ రూపొందించాలని ప్రతిపాదించిందీ విజయ్ కేల్కర్ కావడం గమనార్హం.
పరోక్ష పన్నుల్లోనూ సంస్కరణలు ఇలా..
2006లో పరోక్ష పన్నుల వ్యవస్థలో సంస్కరణలు అమలు చేయాలని ప్రతిపాదించిన తొలి కేంద్ర ఆర్థిక మంత్రి పి చిదంబరం. రాజకీయ సమీకరణాల కారణంగా తర్వాత హోంశాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించినా.. 2012లో మళ్లీ నార్త్ బ్లాక్ లోని ఆర్థిక మంత్రిత్వ శాఖకు తిరిగొచ్చాక చిదంబరం.. జీఎస్టీ అమలులో ఇబ్బందులను అధిగమించేందుకు కమిటీలు, సబ్ కమిటీలు నెలకొల్పడంతోపాటు త్వరితగతిన జీఎస్టీ అమలుకు చొరవ ప్రదర్శించారు. జీఎస్టీ అమలులో ఇబ్బందులపై వివిధ రాష్ట్ర ప్రభుత్వాల అభ్యంతరాలు, సమస్యలు, తీర్మానాల ఆమోదానికి ఈ కమిటీలు, సబ్ కమిటీలు ప్రయత్నించాయి. రాష్ట్ర ప్రభుత్వాలు లేవనెత్తే అన్ని వివాదాస్పద అంశాల పరిష్కారానికి 2012 డిసెంబర్ గడువుగా విధించారు. కానీ ఈ లోగా వివిధ రాజకీయ అంశాల కారణంగా 2014 లోక్సభ ఎన్నికలు ముందుకు రావడంతో జీఎస్టీ విధి విధానాల రూపకల్పనకు అడ్డంకిగా ఉన్న వివాదాంశాలు పరిష్కరించడం క్లిష్టంగా మారింది.
జీఎస్టీ అమలు ఘనత మోదీ సర్కార్దే
భారతదేశంలో అతిపెద్ద పన్నుల సంస్కరణ విధానాన్ని అమలులోకి తెచ్చిన ఘనత ప్రధానమంత్రి నరేంద్రమోడీ సారథ్యంలోని బీజేపీ ప్రభుత్వానికి దక్కింది. కానీ 2014లో ఆర్థిక మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అరుణ్ జైట్లీకే అసలు ఘనత దక్కుతుంది. రాజకీయాలకు అతీతంగా జీఎస్టీ మద్దతు సంపాదించడంలో జైట్లీ కీలకంగా వ్యవహరించారు. రోజురోజుకు ఆశలు సన్నగిల్లుతున్నా అనునిత్యం ఏకాభిప్రాయం సాధించేందుకు క్రుషి చేశారు.ప్రత్యేకించి రాజ్యసభలో జీఎస్టీ బిల్లుకు ఆమోదం కోసం కాంగ్రెస్ పార్టీతో స్నేహ పూర్వకంగా వ్యవహరించడంలో విజయం సాధించారు. తద్వారా 2016 ఆగస్టులో రాజ్యాంగ సవరణ బిల్లుకు ఆమోదం తెలియజేయడంతో జీఎస్టీ అమలు దిశగా అడుగులు వేస్తున్నారు.