షాక్: సగం ఖాతాల్లో సొమ్ము లేదు, వందకు పైగా రిపీట్
న్యూఢిల్లీ: నల్లధనం విషయంలో మరో షాక్! హెచ్ఎస్బీసీ బ్యాంకు జాబితాలని 628 ఖాతాల్లో దాదాపు సగం ఖాతాల్లో సొమ్ము లేదని నల్లధనం పైన సుప్రీం కోర్టుకు ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాఫ్తు బృందం (సిట్) విచారణలో తేలింది. దాదాపు వందకు పైగా పేర్లు రిపీట్ అయ్యాయని కూడా తెలిపింది. దీంతో, ఇటీవల సుప్రీం కోర్టుకు సమర్పించిన జెనీవా హెచ్ఎస్బీసీ జాబితాలోని ఖాతాల్లో 300 ఖాతాలకు సంబంధించి ప్రాసిక్యూషన్ నిర్వహించాలని ఆదాయపు పన్ను శాఖ యోచిస్తోంది.
కాగా, కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు సమర్పించిన 628 మంది జెనీవా హెచ్ఎస్బిసి బ్యాంక్ ఖాతాదారుల జాబితాలోని సుమారు 300 ఖాతాలపై చర్యలు తీసుకోవాలని ఆదాయం పన్ను విభాగం ఇప్పుడు యోచిస్తున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. హెచ్ఎస్బిసి జెనీవా బ్యాంకు జాబితాలోని దాదాపు 289 ఎంట్రీలలో ఎలాంటి సొమ్మూ లేదని, అలాగే జాబితాలో 122 పేర్లు రెండుసార్లు రిపీట్ అయినట్లు సిట్ గుర్తించి, ఆ విషయాన్ని ప్రభుత్వానికి అందజేసిన నివేదికలో కూడా పేర్కొంది.
ఈ జాబితాలో పేర్కొన్న వారిపై చర్యలు తీసుకోవడానికి పెద్ద అడ్డంకి ఈ ఖాతాల లావాదేవీలకు సంబంధించి ఎలాంటి వివరాలూ లేకపోవడమేనని, ఈ ఖాతాలు ఎప్పుడు తెరిచారు, వాటి లావాదేవీల వివరాలు ఏవీ ఈ జాబితాలో ప్రతిఫలించడం లేదని ఆ వర్గాలు తెలిపాయి. మరోవైపు, విదేశాల్లోని నల్లధనం తెప్పించేందుకు నరేంద్ర మోడీ చేస్తున్న ప్రయత్నాలను పాకిస్తాన్కు చెందిన ఇమ్రాన్ ఖాన్ ప్రశంసించారు.
లిస్టులోని వారిపై ఆదాయం పన్ను విభాగం 150 దాకా దాడులు, సోదాలు నిర్వహించిందని, అయితే ఇప్పటి వరకు ప్రాసిక్యూషన్ చర్యలు ఖరారు కాలేదని సుప్రీం కోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ ఎంబి షా నేతృత్వంలోని సిట్ తన నివేదికలో పేర్కొంది. ఇప్పుడు ఈ జాబితాను సుప్రీంకోర్టుకు సమర్పించినందున, ఈ ఆర్థిక సంవత్సరం చివరికల్లా కేసులు పూర్తి చేయాల్సిన గడువు దగ్గర పడుతూ ఉండడంతో దాదాపు 300 కేసులపై ప్రాసిక్షూన్ చర్యలు ప్రారంభించాలని ఐటి విభాగం ఆలోచిస్తోందని చెబుతున్నారు.
రాధా టింబ్లోకు ఎన్ఫోర్స్మెంట్ సమన్లు
నల్లధనం కుబేరుల జాబితాలో పేరున్న గోవాకు చెందిన మైనింగ్ దిగ్గజం రాధా టింబ్లోను తమ ఎదుట హాజరు కావాలంటూ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సమన్లు జారీ చేసింది. ఈ నెల 18న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కార్యాలయంలో అధికారుల ఎదుట హాజరు కావాలని టింబ్లో ప్రైవేట్ లిమిటెడ్ మాజీ డైరెక్టరయిన ఆమెను కోరినట్లు డైరెక్టరేట్ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు.
గోవాతో అక్రమ మైనింగ్ కార్యకలాపాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న సంస్థల్లో ఇది ఒకటి. ఈ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నోటీసులు జారీ చేసిన 16 కంపెనీల్లో ఇది కూడా ఒకటి. సుప్రీంకోర్టుకు సిబిఐ సమర్పించిన నల్లకుబేరుల తొలి జాబితాలో సైతం రాధా టింబ్లో పేరు ఉన్న విషయం తెలిసిందే.