రాజీనామా వెనక్కి తీసుకుంటానన్న పన్నీర్: మాట్లాడని గవర్నర్
తాను రాజీనామాను వెనక్కి తీసుకుంటానని పన్నీర్ సెల్వం గవర్నర్ విద్యాసాగర రావుతో చెప్పినట్లు తెలుస్తోంది. అయితే, గవర్నర్ దానిపై ఏమీ మాట్లాడలేదని సమాచారం.
చెన్నై: తన రాజీనామా లేఖను వెనక్కి తీసుకుంటానని తమిళనాడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం గవర్నర్ చెన్నమనేని విద్యాసాగర రావుతో చెప్పినట్లు సమాచారం. అయితే, విద్యాసాగర రావు ఆ విషయంపై ఏమీ మాట్లాడలేదని తెలుస్తోంది. గురువారం సాయంత్రం తమిళనాడు అపద్దర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం చెన్నైలో రాజ్ భవన్ లో గవర్నర్ విద్యాసాగర్ రావును కలిశారు.
తాను తమిళనాడు ప్రజలకు సేవ చెయ్యడానికి మరో అవకాశం వచ్చిందని పన్నీర్ సెల్వం అన్నారు. అయితే, గవర్నర్ విద్యాసాగర రావుకు, తమకు మధ్య ఏ విధమైన సంభాషణ జరిగిందనే వివరాలను పన్నీర్ సెల్వం చెప్పలేదు. న్యాయం జరుగుతుందని మాత్రమే గవర్నర్ అన్నట్లు పన్నీర్ సెల్వం చెప్పారు.
తాను ముఖ్యమంత్రిగా కొనసాగదలుచుకున్నట్లు పన్నీర్ సెల్వం విద్యాసాగర రావుకు చెప్పినట్లు తెలుస్తోంది. ప్రజలు తన వెంట ఉన్నారని, తనకు న్యాయం చేయాలని ఆయన కోరినట్లు తెలుస్తోంది. శాసనసభ్యులను శశికళ అజ్ఞాత ప్రదేశంలో ఉంచారని, వారిని బందీలుగా ఉంచారని ఆయన ఫిర్యాదు చేసినట్లు సమాచారం.
తాను ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడానికి దారి తీసిన పరిస్థితులను పన్నీర్ సెల్వం విద్యాసాగర రావుకు వివరించినట్లు తెలుస్తోంది. తనను పార్టీలో అవమానాలకు గురి చేశారని, అందుకే రాజీనామా చేశానని ఆయన చెప్పినట్లు సమాచారం.