LIC IPO: ప్రైస్బ్యాండ్, ఓపెన్ తేదీలు ఇవే: పాలసీదారులకు డిస్కౌంట్: రూ.21,000 కోట్లు లక్ష్యం
ముంబై: కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్న జీవిత బీమా సంస్థ (ఎల్ఐసీ) ఇంకొద్ది రోజుల్లో ప్రైవేటుపరం కాబోతోంది. దీనికి సంబంధించిన కసరత్తు ముగిసింది. ఎల్ఐసీ ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్ (ఐపీఓ) జారీ కావడానికి రంగం సిద్ధమైంది. దీనికి సంబంధించిన ప్రైస్ బ్యాండ్ను కేంద్ర ప్రభుత్వం కొద్దిసేపటి కిందటే నిర్ధారించింది కూడా. అతిపెద్ద పబ్లిక్ ఇష్యూగా ఇన్వెస్టర్ల ముందుకు రాబోతోంది. ఎల్ఐసీలో తనకు ఉన్న వాటాలో కొంత శాతాన్ని కేంద్ర ప్రభుత్వం లిక్విడేట్ చేయనుంది.
కీలక పరిణామం..
ఐపీఓకు జారీ చేయడానికి అవసరమైన సన్నాహాలను కేంద్ర ప్రభుత్వం గత ఆర్థిక సంవత్సరంలోనే పూర్తి చేసింది. దీనికి సంబంధించిన ఈ డ్రాఫ్ట్ రెడ్ హర్రెంట్ ప్రాస్పెక్టస్ను సెక్యూరిటీ ఎక్స్ఛేంజ్ బోర్డ్కు సమర్పించింది. సెబి ఆమోదం పొందిన తరువాత వాల్యుయేషన్ను సైతం పూర్తి చేసింది. వాల్యుయేషన్ను కుదించుకుంది. 30 వేల కోట్ల రూపాయలుగా నిర్ధారించుకుంది. తొలుత అయిదుశాతం మేర లిక్విడేట్ చేయాలని కేంద్ర ప్రభుత్వం భావించినప్పటికీ.. ఇప్పుడు దాన్ని 3.5 శాతానికి కుదించింది.
బిగ్గెస్ట్ ఐపీఓ..
ఇప్పుడు తాజాగా 21,000 కోట్ల రూపాయలను సమీకరించుకోవడానికి ఐపీఓను జారీ చేయనుంది కేంద్ర ప్రభుత్వం. బిగ్గెస్ట్ ఐపీఓ ఇదే. పబ్లిక్ ఇష్యూను జారీ చేయడం ద్వారా ఇప్పటివరకు ఈ స్థాయిలో ఇన్వెస్టర్ల నుంచి పెట్టుబడులను రాబట్టుకున్న కంపెనీ మరొకటి లేదు. ఇదివరకు పేటీఎం బిగ్గెస్ట్ ఐపీఓగా ఉండేది. 16,000 కోట్ల రూపాయలను సమీకరించాలనే లక్ష్యంతో పేటీఎం పబ్లిక్ ఇష్యూను జారీ చేసిన విషయం తెలిసిందే.
ఎల్ఐసీ ప్రైస్ బ్యాండ్ ఇదే..
ఎల్ఐసీ ప్రైస్ బ్యాండ్ను కేంద్ర ప్రభుత్వం ఖరారు చేసింది. 902 నుంచి 949 రూపాయలుగా నిర్ధారించింది. అలాట్మెంట్ రూపంలో ఎల్ఐసీ షేర్లను కొనుగోలు చేయదలిచిన ఇన్వెస్టర్లు ఒక్కో షేర్కు గరిష్ఠంగా 949 రూపాయలను చెల్లించాల్సి ఉంటుంది. లాట్ సైజ్ 15గా నిర్ధారితమైంది. అంటే.. ఇన్వెస్టర్లు కనీసం 15 షేర్లను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. దీనికోసం 14,235 రూపాయలను పెట్టుబడి రూపంలో పెట్టాల్సి ఉంటుంది.
మే 4 నుంచి 9 వరకు..
ఎల్ఐసీ పాలసీదారులకు డిస్కౌంట్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఒక్కో షేర్ మీద 60 రూపాయల మేర డిస్కౌంట్ ప్రకటించింది కేంద్రం. రిటైల్ ఇన్వెస్టర్లు, ఉద్యోగులకు 40 రూపాయల రాయితీ ఉంటుంది. ఎల్ఐసీ ఐపీఓ మే 4వ తేదీన ఓపెన్ అవుతుంది. 9వ తేదీన ముగుస్తుంది. యాంకర్ ఇన్వెస్టర్ల కోసం మే 2వ తేదీ నాడే బుకింగ్ ఆరంభమౌతుంది. ఎల్ఐసీ ఉద్యోగుల కోసం 15 లక్షల షేర్లు రిజర్వ్ అయ్యాయి.
20 శాతం ఎఫ్డీఐ
ఎల్ఐసీలో 20 శాతం మేర విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు అనుమతి ఇచ్చింది. దీనిపై ఇదివరకే కేంద్ర మంత్రివర్గం ఓ తీర్మానాన్ని సైతం ఆమోదించిన విషయం తెలిసిందే. ఆటోమేటిక్ రూట్లో ఈ 20 శాతం ఎఫ్డీఐలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 20 శాతం మేర విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు పెట్టడానికి అవకాశాన్ని కల్పించడం ద్వారా అంతమేర అవకాశం స్వదేశీయులకు లేనట్టే. ఎల్ఐసీ యాక్ట్ 1956 ప్రకారం.. దేశీయ జీవిత బీమా సంస్థలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు గానీ, విదేశీ సంస్థలు లేదా వ్యక్తులు వాటాలను కొనుగోలు చేయడానికి గానీ అవకాశం లేదు. దీన్ని సవరించింది.