Temple: సంక్రాంతి పండుగ రోజు గుడిలో లిక్కర్ పార్టీ, ప్రశ్నించిన ఆలయ ఉద్యోగిని ఊచకోత కోసి, లోకల్ !
చెన్నై/ తిరునల్వేలి: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటకలో సంక్రాంతి పండుగ చాలా గ్రాండ్ గా చేసుకుంటారు. తమిళనాడులో సంక్రాంతి పండుగ చేసినంత ఘనంగా మరో పండుగ చేసుకోరు అంటే అతిసయోక్తికాదు. ఇతర ప్రాంతాలు, వేరే రాష్ట్రాల్లో ఉంటున్న తమిళ సోదరులు దాదాపుగా సంక్రాంతి పండుగకు వారి సొంత ఊర్లకు వెళ్లిపోయి వారి కుటుంబ సభ్యులు, బంధువులత కలిసి ఎంతో సంతోషంగా పండుగ జరుపుకుంటారు. తమిళనాడులో సంక్రాంతి పండుగ మూడు రోజులు, నాలుగు రోజులు, కొన్ని ప్రాంతాల్లో వారం రోజుల పాటు పండుగ జరుపుకుంటారు. అలాంటి సంక్రాంతి పండుగ రోజు గుడిలో ఆలయ ఉద్యోగిని ఆయన పని చేస్తున్న గుడి ఆవరణంలో ఊచకోత కోసి దారుణంగా హత్య చెయ్యడం ఆ ప్రాంతంలో కలకలం రేపింది.
ఊరికి వెళ్లిన ఆలయ ఉద్యోగి
తమిళనాడులోని తిరునల్వేలి జిల్లాలోని మేలచెవాల్ ప్రాంతానికి చెందిన కృష్ణన్ (55). ఆ ప్రాంతంలోని పురాతన ఆలయం, ఎంతో ప్రసిద్ది చెందిన నవనీత కృష్ణ స్వామి ఆలయంలో నిర్వహణ పనులు చేసేవాడు. ఉదయం తన మామూలు పని ముగించుకుని సంక్రాంతి పండుగ (పొంగల్) జరుపుకోవడానికి అతని ఇంటికి వెళ్లాడు. పగలు కుటుంబ సభ్యులు, బంధువులతో కలిసి సంతోషంగా పొంగల్ పండుగ జరుపుకున్నాడు.
షాక్ అయిన ఆలయ ఉద్యోగి
రాత్రి మళ్లీ గుడి దగ్గరకు కృష్ణన్ వెళ్లాడు. ఆలయం దగ్గరకు తిరిగి వెళ్లే సరికి అదే ప్రాంతానికి చెందిన కెంపయ్యతో పాటు పలువురు ఆలయం ఆవరణలో మద్యం సేవిస్తూ లిక్కర్ పార్టీ జరుపుకుంటున్నారని ఉద్యోగి కృష్ణన్ గమనించాడు. ఈ సందర్భంలో కృష్ణన్ ఇది గుడి అనుకుంటున్నారా ?, లిక్కర్ షాపు అనుకుంటున్నారా, మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని మనవి చేశాడు,
మద్యం మత్తులో నరికేశారు
ఆలయం ఆవరణంలో మద్యం సేవిస్తున్న కొంతమందికి, కృష్ణన్ ల మధ్య వాగ్వాదం జరిగింది. తరువాత మదయం సేవిస్తున్న నిందితులు రెచ్చిపోయారు. ఆ సందర్బంలో కృష్ణన్ మీద దాడి చేసిన నిందితులు తరువాత కత్తులు, వేటకొడవళ్లతో అతన్ని నరికేశారు. తరువాత కృష్ణన్ కేకలు వేస్తూ రక్తపు మడుగులో ఆలయం ఆవరణంలో స్పృహతప్పి పడిపోయాడు. కృష్ణన్ కుప్పకూలిపోవడంతో నిందితులు అక్కడి నుంచి పారిపోయారు.
బుద్దిమాటలు చెప్పినందుకు పండుగ రోజు హత్య
ఇంతలో కృష్ణన్ అరుపులు విన్న స్థానికులు వెంటనే గుడి దగ్గరకు వెళ్లి కృష్ణన్ను రక్షించి తిరునల్వేలిలోని ఓ ఆసుపత్రికి తరలించారు. తరువాత మురుగైన చికిత్స కోసం తిరునల్వేలి జిల్లా ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ కృష్ణన్ మృతి చెందాడు. కృష్ణన్ హత్యకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసి ఐదుగురిని అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మాటల వివాదంలో ఆలయ ఉద్యోగి కృష్ణన్ అదే గుడిలో హత్యకు గురి కావడం ఆ ప్రాంతంలో కలకలం రేపింది.