రోజుకు మూడు గంటల పాటు మద్యం విక్రయాలు .. అలా అయితేనే !!
దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి తన ప్రతాపాన్ని చూపిస్తుంది. ఇప్పటికి దేశ వ్యాప్తంగా 4917 కేసులు నమోదు అయ్యాయి . ఇక దీనిని బట్టి ఎంతలా విజృంభిస్తుందో తెలుసుకోవచ్చు . ఇప్పటికే దేశంలో 137 మరణాలు సంభవించాయి.. కరోనా వైరస్ను నియంత్రించేందుకు కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు అనేక చర్యలు తీసుకుంటున్న క్రమంలో భాగంగానే దేశ వ్యాప్తంగా మూడు వారాలపాటు , ఏప్రిల్ 14వరకు లాక్డౌన్ విధించింది కేంద్ర సర్కార్ . ఈ క్రమంలో మద్యం షాపులు కూడా మూతపడ్డాయి. ఇప్పటికే మందుబాబుల తిప్పలు చూడలేని సర్కార్ వారి విషయంలో ఆలోచనలో పడింది .

మద్యం అమ్మకాల గురించి ఆలోచిస్తున్న కర్ణాటక సర్కార్
లాక్ డౌన్ నేపధ్యంలో నిత్యావసరాలు మినహాయించి మరే ఇతర షాపులు తెరవకుండా తగు జాగ్రత్తలు తీసుకున్నారు . అయితే మందుబాబులు ఊహించని విధంగా మద్యం షాపులు బంద్ అవ్వడంతో మద్యం ప్రియులకు షాక్ తగిలింది. పలుచోట్ల మద్యం లేకపోవడంతో ఆత్మహత్యలకు కూడా పాల్పడుతున్నారు. ఇక మందు బాబులు లిక్కర్ దొరక్క వీక్ నెస్ కు గురవుతున్నారు. ముఖ్యంగా కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లో లిక్కర్ కోసం ఆత్మహత్యలకు పాల్పడిన ఘటనలు ఎక్కువగా చోటు చేసుకున్నాయి. దీంతో అక్కడి ప్రభుత్వాలు మద్యం అమ్మకాల అంశంపై ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.

రోజుకు మూడు గంటలు మద్యం విక్రయాలు చెయ్యాలని ఎక్సైజ్ శాఖ ఆలోచన
లాక్డౌన్ ఏప్రిల్ 14న లెక్క ప్రకారం ముగియాలి. కానీ రాష్ట్ర ప్రభుత్వాలు తాజాగా పెరుగుతున్న కేసుల నేపధ్యంలో రిస్క్ దేనికని లాక్ డౌన్ పొడిగించాలని కేంద్రానికి సూచించాయి. కేంద్రం ఇంకా దీనికి సంబంధించి ఏ నిర్ణయం తీసుకోలేదు . ఒకవేళ లాక్ డౌన్ ముగియకుండా కొనసాగిస్తే అప్పుడు మందుబాబులకు రోజుకు మూడు గంటలపాటు మద్యం విక్రయాలు జరిపేందుకు కర్ణాటక రాష్ట్ర ఎక్సైజ్ శాఖ యోచిస్తోంది.ఇక కర్ణాటక లోనూ 175 కేసులు నమోదు కావటంతో ప్రభుత్వం లాక్ డౌన్ ఎత్తివేస్తే పరిస్థితి ఎలా ఉంటుంది అన్న అంశంపై అధ్యయనం చేస్తుంది .

లాక్ డౌన్ కంటిన్యూ చేస్తే మద్యం షాపులు మూడు గంటల పాటు తీసే అవకాశం
ఏప్రిల్ 14వతేదీ తర్వాత ఒకవేళ అనివార్య పరిస్థితుల నేపధ్యంలో లాక్డౌన్ను పొడిగిస్తే ప్రతీ రోజు ఉదయం 10.00 గంటల నుంచి మధ్యాహ్నం 1.00 గంట వరకు మొత్తం మూడు గంటలపాటు మద్యం విక్రయించాలని ఆలోచిస్తోంది. ఇప్పటికే లిక్కర్ కోసం పిచ్చి వాళ్ళవుతున్న మందుబాబులు మద్యం కోసం పలుచోట్ల వైన్స్ షాపుల్లో చోరీలు కూడా చేస్తున్న పరిస్థితి ఉంది . ఈ నేపథ్యంలో వీటన్నింటికి చెక్ పెట్టేందుకు మూడు గంటలపాటు మద్యం విక్రయించే అంశంపై ఆలోచిస్తున్నామని, దీనిపై తుది నిర్ణయం సీఎం తీసుకుంటారని కర్ణాటక ఎక్సైజ్ శాఖ కమిషనర్ యశ్వంత్ తెలిపారు. ఏది ఏమైనా మద్యం కోసం ప్రాణాలు తీసుకుంటున్న వారికి కౌన్సిలింగ్ ఇచ్చి వారిని మార్చాల్సిన అవసరం ఉంది .












Click it and Unblock the Notifications