సహజీవనం ఆమోదం యోగ్యం కాదు, రక్షణ కల్పించలేం: హైకోర్టు కీలక తీర్పు
ఛండీగఢ్: ఇటీవల కాలంలో సమాజంలో ఎక్కువగా కొనసాగుతున్న 'సహజీవనం'పై పంజాబ్-హర్యానా హైకోర్టు కీలక తీర్పును వెలువరించింది. సహజీవనం అనేది సామాజికంగా, నైతికంగా ఆమోదయోగ్యం కాదని న్యాయస్థానం వ్యాఖ్యానించింది. అంతేగాక, సహజీవనం చేస్తున్న జంటకు తమ తల్లిదండ్రుల నుంచి రక్షణ కల్పించేందుకు నిరాకరించింది.
సింగిల్ జడ్జీ జస్టిస్ హెచ్ఎస్ మదాన్ ఈ మేరకు తీర్పు వెలువరించారు. గుల్జా కుమారి, గౌరీందర్ సింగ్ అనే జంట.. తాము సహజీవనంలో ఉన్నామని, త్వరలో పెళ్లి చేసుకుంటామని కోర్టుకు తెలిపారు. ప్రస్తుతం సహజీవనంలో ఉన్నామంటున్న ఆ జంటకు రక్షిణ కల్పించాలంటూ తాము ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేమని న్యాయస్థానం తెలిపింది.
ఎందుకంటే, సహజీవనం అనేది సామాజికంగా, నైతికంగా అంగీకరించేది కాదని కోర్టు స్పష్టం చేసింది. ఇటీవల ఇలాంటి పిటిషన్ దాఖలు కాగా, ఇదే హైకోర్టు మరో బెంచ్ దాన్ని కొట్టివేసింది. సహజీవనం చేస్తున్న జంటలకు రక్షణ కల్పించడం వల్ల సమాజంలో తప్పుడు సంకేతాలు వెళ్లే అవకాశం ఉందని, వ్యవస్థలో సరికొత్త ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని పేర్కొంది.