‘బీజేపీతోనే ఉంటాం కానీ, నితీష్ నాయకత్వంలో పనిచేయం’: ఎన్డీఏకు ఎల్జేపీ షాక్
పాట్నా: బీహార్ అసెంబ్లీ ఎన్నికల ముందు నేషనల్ డెమోక్రాటిక్ అలియన్స్ (ఎన్డీఏ)లో లుకలుకలు బయటపడుతున్నాయి. తాజాగా, లోక్ జనశక్తి పార్టీ(ఎల్జేపీ) తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది. ఎల్జేపీ, జేడీయూకి గత కొంత కాలంగా విభేదాలు కొనసాగుతున్న విషయం తెలిసిందే.

ఎన్డీఏ నుంచి బయటకు.. కానీ
ఈ నేపథ్యంలో తాము ఎన్డీఏ కూటమి నుంచి బయటికి వస్తున్నట్లు ఎల్జేపీ అధ్యక్షుడు చిరాగ్ పాశ్వాన్ స్పష్టం చేశారు. తాము జేడీయూ అధినేత, ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నేతృత్వంలో ఎన్నికలకు వెళ్లలేమని తేల్చి చెప్పారు. అయితే, తాము బీజేపీతో మాత్రమే భాగస్వామి పార్టీగా ఉంటామని వెల్లడించారు. చిరాగ్ పాశ్వాన్ అధ్యక్షతన ఆదివారం ఎల్జేపీ పార్లమెంటరీ బోర్డు మీటింగ్ జరిగింది. బీజేపీ కూటమికి మద్దతుగా, ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వాన్ని బలోపేతం చేసేందుకు ఎమ్మెల్యేలు పనిచేస్తారని ఈ సమావేశంలో తీర్మానం చేశారు.

నితీష్ నాయకత్వంలోనేనంటూ బీజేపీ
కాగా, నితీష్ కుమార్ నేతృత్వంలోనే ఎన్డీఏ కూటమి అసెంబ్లీ ఎన్నికలకు వెళుతుందని ఇప్పటీకే బీజేపీ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, తాజా ఎల్జేపీ తీర్మానం మాత్రం ఎన్డీఏ కూటమిని చీల్చేదిగా ఉంది. బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం అనంతరం పార్టీ అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. అక్టోబర్ 28 నుంచి ఎన్నికలు ప్రారంభంకానున్న విషయం తెలిసిందే.
Recommended Video

ఎల్జేపీతో విభేదాలు లేవంటున్నా..
ఎల్జేపీ చీఫ్ చిరాగ్ పాశ్వాన్తో సీట్ల పంపకాలపై హోంమంత్రి అమిత్ షా, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా గురువారం సమావేశం కూడా నిర్వహించారు. 243 స్థానాలున్న అసెంబ్లీ ఎన్నికల్లో 143 సీట్లలో నితీష్ కుమార్ పార్టీ జేడీయూ పోటీ చేసేందుకు ఒత్తిడి చేయడంపై ఎల్జేపీ వ్యతిరేకతను వ్యక్తం చేస్తోంది. ఎల్జేపీతో బీజేపీకి ఎలాంటి విభేదాలు లేవని అమిత్ షా చెప్పగా.. ఓ ఎల్జేజీ సీనియర్ నేత మాత్రం సీట్ల పంపకాలు ఇంకా పూర్తిగా జరగలేదని అన్నారు. కాగా, నితీష్ కుమార్ నేతృత్వంలో పనిచేసేందుకు ఎల్జేపీ నేతలు వ్యతిరేకిస్తున్నారు. 2015లో 42 స్థానాల్లో పోటీ చేసిన ఎల్జేపీ.. రెండు స్థానాల్లో గెలిచింది.












Click it and Unblock the Notifications