మోడీ బుజ్జగింపు: గాంధీనగర్పై బెట్టు వీడిన అద్వానీ
న్యూఢిల్లీ: గాంధీ నగర్ నుండి పోటీ చేసేది లేదని తనకు భోపాల్ సీటును కేటాయించాల్సిందేనని పట్టుబట్టిన భారతీయ జనతా పార్టీ అగ్రనేత లాల్ కృష్ణ అద్వానీ బెట్టు వీడారు. అద్వానీ నివాసాని బిజెపి సీనియర్ నేతలు సుష్మా స్వరాజ్, వెంకయ్య నాయుడు, ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ తదితరులు వెళ్లి నచ్చజెప్పారు. దీంతో ఆయన రాజీ పడ్డారు. అరగంట పాటు మోడీ ఆయనతో ఏకాంతంగా చర్చలు జరిపారు.
తాను గాంధీనగర్ నుంచి పోటీ చేస్తున్నట్లు అద్వానీ గురువారం ప్రకటించారు. పార్టీలో ఆధిపత్య సమస్య తలెత్తిన ప్రతిసారీ తొలుత దూకుడుగా వ్యవహరించి, ఆ తర్వాత రాజీపడటం ఆయనకు పరిపాటిగా మారింది. గతంలో మోడీని పార్టీ ఎన్నికల ప్రచార కమిటీ అధ్యక్షుడిగా నియమించే అవకాశాలున్నాయని తెలియటంతో గోవాలో జరిగిన జాతీయ కార్యవర్గ సమావేశానికి ఆరోగ్యం బాగుండలేదన్న సాకుతో గైర్హాజరై ఆయన తన అసమ్మతిని ప్రకటించారు.
ఆ వెంటనే మోడీపై ప్రశంసలు కురిపించారు. మోడీని ప్రధాని అభ్యర్థిగా బిజెపి ప్రకటించడంతో చిరకాల వాంఛకు గండి పడిందన్న అసంతృప్తితో కొన్నాళ్లు పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉన్నారు. తాజాగా గాంధీనగర్ బదులు భోపాల్ నుంచి పోటీ చేసే అవకాశం ఇవ్వాలని పట్టుబట్టిన అద్వానీ తన విజయావకాశాలకు మోడీ గండి కొడతారేమోనన్న భావించారు.
గురువారం నాయకులందరినీ తన చుట్టూ తిప్పుకుని రాజకీయ వేడి పుట్టించి చివరకు రాజీ పడ్డారు. కాగా, అద్వానీని పక్కన పెట్టినట్లు జరుగుతున్న ప్రచారంలోనిజం లేదని, ఎక్కడి నుంచి పోటీ చేయాలన్న విషయమై తుది నిర్ణయం ఆయనకే విడిచిపెడుతున్నామని పార్టీ అధ్యక్షుడు రాజ్నాథ్ సింగ్ ప్రకటించారు. దీంతో అద్వానీ ఇరుకున పడ్డారు. సాయంత్రం తన మద్దతుదారులతో సమాలోచనలు జరిపి గాంధీనగర్ నుంచే పోటీ చేస్తానని ప్రకటించారు.
మోడీ గురువారం ఉదయం తన నివాసానికి వచ్చి గాంధీనగర్ నుంచే పోటీ చేయాలని కోరినట్లు అద్వానీ తెలియచేశారు. మధ్యప్రదేశ్ బిజెపి విభాగం కూడా తనను భోపాల్ నుంచి పోటీ చేయాలని కోరినట్లు చెప్పారు. గాంధీ నగర్తో తనకున్న అనుబంధాన్ని దృష్టిలో పెట్టుకుని అక్కడి నుంచే పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. కాగా, ఆర్ఎస్ఎస్ మధ్యవర్తిత్వంతో దీనికి తెర పడింది.