రుణాల రీషెడ్యూల్కు రిజర్వ్ బ్యాంక్ నో: బాబు
హైదరాబాద్: గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల రుణాల రీషెడ్యూల్ ఇబ్బందిగా మారిందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. సమయం మించి పోయినందున రుణాల రీషెడ్యూల్కు రిజర్వ్ బ్యాంక్ సుముఖత చూపడం లేదని తెలిపారు.
శనివారం అన్ని జిల్లాల కలెక్టర్లతో చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రుణమాఫీ, అంటువ్యాధులు, ఎరువులు, విత్తనాల సరఫరాతో పాటు పలు అంశాలపై చర్చించారు. వీలైనంత త్వరగా కుటుంబానికి రూ.1.5 లక్షల చొప్పున రుణమాఫీ చేద్దామని చంద్రబాబు కలెక్టర్లకు సూచించారు.
రుణమాఫీపై రిజర్వ్ బ్యాంక్ నుంచి ఇంకా మార్గదర్శకాలు రావాలని, బ్యాంకులకు షూరిటీలు ఇచ్చిన రుణమాఫీ సాధిస్తామని చంద్రబాబు చెప్పారు. కడప, అనంతపురం జిల్లాలను కరువు ప్రాంతాలుగా గుర్తించి ప్రత్యేక ప్యాకేజీలు తయారు చేయాలని ఆ రెండు జిల్లాల కలెక్టర్లను చంద్రబాబు ఆదేశించారు. ప్రభుత్వ ఆదేశాలను అధికారులు సీరియస్గా తీసుకోవాలని ఆయన సూచించారు. సవాల్గా స్వీకరించి పనులు చేయాలని కూడా ఆయన సూచించారు.
ఇదిలావుంటే, వైద్య ఆరోగ్య శాఖపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పనితీరు మెరుగుపరుచుకోవాలని ఆయన అధికారులను ఆదేశించారు. ప్రజారోగ్యం విషయంలో మరింత శ్రద్ధ చూపాలని ఆయన అన్నారు.