భయం..భయం: అరచేతిలో ప్రాణాలు .. బంకర్లలో జీవితాలు,పీఓకేలో పరిస్థితి ఇదీ!
కుప్వారా: భారత్ పాకిస్తాన్ సరిహద్దురేఖ వద్ద కాల్పులతో ఆ ప్రాంతంలో నివాసం ఉంటున్న ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ఎప్పుడు ఏ బుల్లెట్ వచ్చి పడుతుందో అన్న భయం వారిలో నెలకొంది. కుప్వారా జిల్లా తంగ్ధర్ సెక్టార్లో ఆందోళనకర పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇరు దేశాల మధ్య కాల్పులు జరుగుతుండటంతో అక్కడి స్థానికులు ఇళ్లను వీడి సమీపంలో ఉన్న బంకర్లలో తలదాచుకుంటున్నట్లు పోలీసులు చెప్పారు.
కాల్పులకు దిగిన పాకిస్తాన్
పాకిస్తాన్ కాల్పులకు పాల్పడటంతో సిద్ధిఖ్ అనే సామాన్య పౌరుడితోపాటు మరో ఇద్దరు ఆర్మీ జవాన్లు మృతి చెందారు. దీంతో భారత్ ప్రతీకార చర్యకు దిగింది. సరిహద్దు రేఖ వెంబడి భారత జవాన్లు కాల్పులు జరిపి పాకిస్తాన్ ఉగ్రశిబిరాలను ధ్వంసం చేశారని భారత ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ చెప్పారు. ఉగ్రవాదులు భారత్లోకి చొరబడేందుకు సహాయం చేసే క్రమంలోనే పాకిస్తాన్ సైన్యం కాల్పులకు తెగబడిందని రావత్ తెలిపారు. భారత్ కాల్పుల్లో ఆరుమంది పాక్ జవాన్లు మృతి చెందినట్లు స్పష్టం చేశారు.
బంకర్లలో తలదాచుకుంటున్న స్థానికులు
మృతి చెందిన సిద్ధిఖ్ గిండిషాట్ నివాసి అని స్థానికులు తెలిపారు.పాకిస్తాన్ వైపు నుంచి వచ్చిన పేలుడు గుండ్లు గుండిషాట్లో పడ్డాయని ఇష్ఫక్ అహ్మద్ అనే వ్యక్తి చెప్పారు. ఒకటి సిద్ధిఖ్ ఉన్న ప్రాంతంలో పడటంతో ఆయన మృతి చెందాడని అహ్మద్ తెలిపాడు. గ్రామంలో భయాందోళన వాతావరణం కనిపిస్తోందని వెల్లడించాడు. కొందరు ఇళ్లను వీడి బంకర్లలో తలదాచుకుంటుండగా మరికొందరు ఇళ్లలో నేలపై పడుకుని కాలం వెల్లదీస్తున్నారని అహ్మద్ చెప్పాడు. మహిళలు, చిన్నపిల్లలు భయంతో వెక్కివెక్కి ఏడుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు అహ్మద్. వీరి ఆర్తనాదాలు రాత్రంతా వినిపించాయని చెప్పాడు. ఇక వారి బతుకులపై ఆశ వదులుకున్నారని అహ్మద్ వెల్లడించాడు.
ఇళ్లు ధ్వంసం, గోవులు మృతి
ముగ్గురు సామాన్య పౌరులు గాయపడ్డారని ఇద్దరి పరిస్థితి సాధారణంగానే ఉందని మరొక వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయని చెప్పారు పోలీసు అధికారులు. పాకిస్తాన్ కాల్పులకు తెగబడటంతో ఏడు నుంచి ఎనిమిది ఇళ్లు ధ్వంసమయ్యాయని పోలీసులు తెలిపారు. స్థానికులు నిల్వ ఉంచిన వడ్లు ఇతరత్ర సామగ్రి అంతా ధ్వసమైందని చెప్పారు. ఇక పేలుడు గుండ్లు గోశాలను తాకడంతో ఆరు ఆవులు 10 మేకలు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.
బంకర్లను పునర్నిర్మించాలి
2003లో కాల్పుల ఒప్పందం విరమణపై ఇరుదేశాలు సంతకాలు చేశాకా సరిహద్దుల్లో జరిగిన అతిపెద్ద కాల్పులు ఇవే అని మరో స్థానికుడు పేర్కొన్నాడు. 2005లో భూకంపం సంభవించిన సమయంలో చాలా భూగర్భ బంకర్లు ధ్వంసమయ్యాయి. ఆ తర్వాత కాల్పులకు బ్రేక్ పడటంతో ఈ బంకర్ల పునర్నిర్మాణం చేపట్టలేదు. ఇక వీటిని వెంటనే తిరిగి నిర్మించాలని స్థానికులు డిమాండ్ చేశారు.