లాక్ డౌన్ 5.0 .. కరోనా ఉధృతంగా ఉన్న ఆ 11 నగరాలపైనే మెయిన్ ఫోకస్ ?
కరోనావైరస్ వ్యాప్తిని నియంత్రించటం కోసం మే 31 తర్వాత కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ ను మరో రెండు వారాల వరకు పొడిగించే అవకాశం ఉంది, అయితే ఇంకా ఎక్కువ సడలింపులు కూడా ఇచ్చే అవకాశం ఉంది. లాక్ డౌన్ 5.0 జూన్ ఒకటి నుండి కొనసాగే అవకాశం ఉంది . అయితే దేశంలోని కోవిడ్ -19 కేసులలో దాదాపు 70 శాతం ఉన్న 11 నగరాలపై ఎక్కువ ఫోకస్ పెడతారని తెలుస్తుంది .

కరోనా కేసులు పెరుగుతున్న 11 నగరాలపై దృష్టి పెట్టనున్న కేంద్రం
ఆరు ప్రధాన మెట్రో నగరాలు ఢిల్లీ , ముంబై, బెంగళూరు, చెన్నై, అహ్మదాబాద్ మరియు కోల్కతాలతో పాటు పూణే, థానే, జైపూర్, సూరత్ మరియు ఇండోర్ ఉన్నాయి. ఇక్కడ కరోనా కేసులు పెరుగుతున్న నేపధ్యంలోనే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్టు తెలుస్తుంది. భారతదేశంలో కరోనావైరస్ కేసుల సంఖ్య ఇప్పటికే లక్షన్నర దాటింది. గత 14 రోజుల్లో కరోనా కేసుల సంఖ్య రెట్టింపు అయ్యింది. ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తాజా సమాచారం ప్రకారం భారతదేశంలో మరణాల సంఖ్య కూడా గత పదహారు రోజుల్లో దాదాపు రెట్టింపు అయ్యి 4,540 కు చేరుకుంది.

కేసుల పెరుగుదల భారత వైద్య వ్యవస్థకు సవాల్
కేసుల నిరంతర పెరుగుదల భారతదేశం యొక్క వైద్య వ్యవస్థకు తీవ్రమైన సవాలుగా పరిణమిస్తుంది. ఇక లాక్ డౌన్ యొక్క నాల్గవ దశలో కేంద్రం కంటైన్మెంట్ జోన్లకు చాలా ఆంక్షలను విధించింది . ఇక ఇతర వ్యాపార కార్యాకలాపాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది . అన్ని మార్కెట్లు, కార్యాలయాలు, పరిశ్రమలు మరియు వ్యాపారాల నిర్వహణతో పాటు అన్ని ఇతర ప్రాంతాలలో బస్సులను నడుపుతూ జనజీవనం సాధారణం అయ్యేందుకు ప్రయత్నం చేస్తుంది. గత వారం, పరిమిత సామర్థ్యంతో దేశీయ విమానాల కార్యకలాపాలను కూడా ప్రభుత్వం అనుమతించింది.

లాక్ డౌన్ 5.0 లోనూ సడలింపులు
ఇక లాక్ డౌన్ 5.0 లో చేర్చబడే సడలింపులలో ప్రార్థనా స్థలాలను తిరిగి తెరవడం, అలాగే దేవాలయాలు, జిమ్ సెంటర్లు తెరవడానికి అనుమతించవచ్చని ప్రభుత్వ అధికారులు తెలిపారు. జూన్ 1 నుండి దేవాలయాలు మరియు చర్చిలను తిరిగి తెరవడానికి మొగ్గు చూపుతున్నట్లు కర్ణాటక ప్రభుత్వం ఇప్పటికే తెలిపింది. మాల్స్ మరియు మతపరమైన ప్రదేశాలను తెరవడానికి కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం దీనికి అనుమతిస్తుందని ముఖ్యమంత్రి బి ఎస్ యడ్యూరప్ప మీడియాతో అన్నారు.

మాల్స్ , స్కూల్స్ , కాలేజీలు ఇప్పట్లో లేనట్టే
లాక్ డౌన్ యొక్క తదుపరి దశలో మాల్స్, సినిమా హాళ్ళు, పాఠశాలలు, కళాశాలలు, ఇతర విద్యాసంస్థలు మరియు పెద్ద సమావేశాలను కలిగి ఉన్న ఇతర ప్రదేశాలపై ఆంక్షలను కొనసాగించే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. కొన్ని రాష్ట్రాలు జూన్లో పాఠశాలలు ప్రారంభించే ఆలోచనలో ఉన్నాయి. అయితే కేంద్ర ప్రభుత్వం ఇంకా దీనికి అనుకూలంగా లేదని తెలుస్తుంది. కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉన్న 11 నగరాలపైనే ప్రధానంగా ఫోకస్ పెట్టి ఆ 11 నగరాలలో ఆంక్షలను విధించనుంది . మిగతా లాక్ డౌన్ సడలింపులను మరోమారు ప్రకటించనుంది .












Click it and Unblock the Notifications