లాక్ డౌన్ ఎఫెక్ట్ ... డిజిటల్ టీచింగ్ .. ఆన్ లైన్ క్లాసెస్ తో స్టూడెంట్స్ బిజీ
కరోనా దెబ్బకు దేశమే ఇంటికి పరిమితం అయ్యింది. ఇక కేంద్రప్రభుత్వం 21రోజులపాటు విధించిన లాక్డౌన్ తో జనజీవనం ఎక్కడిది అక్కడే నిలిచిపోయింది . ఇక ప్రధానంగా దేశవ్యాప్తంగా విద్యాసంస్థలు మూతపడ్డాయి. పరీక్షల సమయంలో విద్యార్థులు ఇళ్లకే పరిమితం కావాల్సిన పరిస్థితి వచ్చింది . ఈ సమయంలో విద్యార్థులు నష్టపోకుండా ఉండేందుకు కొన్ని విద్యాసంస్థలతో పాటు కొందరు తల్లిదండ్రులు ఆన్లైన్ క్లాసులపై శ్రద్ద చూపిస్తున్నారు. విద్యార్థుల సమయం వృధా కాకుండా ఉన్న సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుకుని తరగతులు నిర్వహించాలని భావిస్తున్న విద్యా సంస్థలు అందుకు శ్రీకారం చుట్టాయి.
కరోనా ఎఫెక్ట్ తో ఆన్ లైన్ క్లాసులకు తెరతీసిన విద్యాసంస్థలు
ఇప్పటికే చాలా ప్రైవేట్ కళాశాలలు, ప్రైవేట్ యూనివర్సిటీలు డిజిటల్ బోధనకు తెరతీశాయి. ఇక చాలా స్కూల్స్ సైతం ఆన్ లైన్ క్లాస్ లకు ఆసక్తి చూపిస్తున్నాయి. పాఠశాల స్థాయి నుంచి యూనివర్సిటీ విద్యార్థుల వరకు ఆన్లైన్ అసైన్మెంట్లు, రికార్స్ ఇచ్చి విద్యార్థులు చదువుకు దూరం కాకుండా ప్రయత్నం చేస్తున్నారు. విలువైన సమయాన్ని వృధాగా గడపకుండా సద్వినియోగం చేయడంతోపాటు విద్యార్థులను అడ్వాన్స్ తరగతులకు సిద్ధంచేసేందుకు చేపట్టిన ఆన్లైన్ పాఠాలు ఇంట్లో ఉండే నేర్చుకుంటున్నారు చాలా మంది విద్యార్థులు .
విద్యా సంవత్సరం వృధా కాకుండా ప్లాన్
ఇప్పటికే యూనివర్సిటీలు, వాటికి అనుబంధ కళాశాలలు, ప్రైవేట్ పాఠశాలలతో పాటు ఐఐటీ, ఎన్ఐటీ, ట్రిపుల్ ఐటీ, ఇంజనీరింగ్, ఫార్మసీ, ఎంబీఏ, ఎంసీఏ విద్యాబోధన చేసే యాజమాన్యాలు అన్నీ ఆన్లైన్ పాఠాలు బోధిస్తున్నాయి .అకడమిక్ ఇయర్ వృధా కాకుండా ప్లాన్ చేస్తున్నాయి. ఇప్పటికే చాలా యూనివర్సిటీలు విద్యార్థులకు టైమింగ్ ఇచ్చి మరీ ఆన్ లైన్ తరగతులు నిర్వహిస్తున్నాయి. అంతే కాదు ఆన్ లైన్ తరగతులకు కూడా హాజరు నమోదు తీసుకుంటున్నాయి. విద్యార్థులకు డిజిటల్ విద్యాబోధన చేసేందుకు విద్యాసంస్థల యాజమాన్యాలు, అటు విద్యార్థుల, తల్లిదండ్రుల వాట్సప్ గ్రూపులను క్రియేట్ చేసి అసైన్మెంట్లు ఇస్తున్నాయి.
లాక్ డౌన్ నేపధ్యంలో కార్పోరేట్ విద్యా సంస్థల డిజిటల్ విద్యా ప్రణాళిక
ఆన్లైన్ బోధన ద్వారా విద్య నేర్పుతున్న కోవలో కార్పొరేట్ పాఠశాలల విద్యార్థులు, కళాశాలల విద్యార్థులు అధికంగా ఉంటున్నారు. ప్రస్తుతం కొన్ని విద్యా సంస్థలు మాత్రమే విద్యార్థులకు డిజిటల్ విద్యాబోధన చేస్తున్నాయి. ఇక ఒకవేళ లాక్డౌన్ పీరియడ్ మరికొంత పొడిగిస్తే మాత్రం దాదాపు అన్ని విద్యా సంస్థలు అదేబాట పట్టే అవకాశముంది. ఇక ప్రభుత్వాలు సైతం యువతకు ఉపయోగపడే వివిధ అంశాలను నిపుణ, సంగీతం, నృత్యం, నైతిక విద్య, విదేశీ విద్య వంటి అనేక విషయాలను కార్యక్రమాలుగా ప్రత్యక్ష ప్రసారం చేయిస్తున్నాయి. ఇక లాక్ డౌన్ పరిస్థితులు ఇలాగే కొనసాగితే మన దేశంలో కూడా డిజిటల్ విధానంలోనే అన్ని విద్యాసంస్థలు విద్యా బోధన చేసినా ఆశ్చర్యపోనక్కరలేదు .