కరోనా విలయంపై ప్రధాని మోదీ - లాక్డౌన్ ముగిసినా వైరస్ చావలేదు - అమెరికా కంటే మనమే బెటర్
''కరోనా మహమ్మారిపై పోరాటంలో జనతా కర్ఫ్య నుంచి మొదలుకొని ఇవాళ్టి వరకు భారతీయులందరం సుదీర్ఘంగా శ్రమించాం. సమయానుకూలంగా నిర్ణయాలు తీసుకోవడంతో ఆర్థిక పరిస్థితి మళ్లీ గాడిన పడింది. జన జీవితం క్రమంగా సర్దుకుంది. ప్రస్తుతం పండుగల సీజన్ కావడంతో అంతటా జనసంచారం మళ్లీ పెరిగింది. అయితే మనం ఒక విషయాన్ని మర్చిపోరాదు.. ముగిసింది లాక్ డౌన్ మాత్రమే.. వైరస్ ఇంకా పూర్తిగా చావలేదు. కాబట్టి మనందరం పండుగల వేళ మరింత జాగ్రత్తగా వ్యవహరించాలి'' అని ప్రధాని నరేంద్ర మోదీ జాతికి పిలుపునిచ్చారు.
Recommended Video
అమెరికా కంటే బెంటర్..
ప్రధాని మోదీ ఇంకా ఏం చెప్పారంటే.. ‘‘కరోనా విషయంలో ఇవాళ మనం సురక్షిత స్థానంలో ఉన్నాం. దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉంది. భారత్ లో కొవిడ్ రికవరీ రేటు అధికంగా, మరణాల రేటు తక్కువగా ఉంది. దేశంలో ప్రతి 10 లక్షల మందిలో 5500 మందికి కరోనా వైరస్ సోకింది. అదే అమెరికా, బ్రెజిల్ లో ఆ సంఖ్య 25వేల దాకా ఉంది. అంతేకాదు, మన దగ్గర ప్రతి 10 లక్షల మందిలో కేవలం 83 మంది మాత్రమే కరోనా కాటుకు చనిపోగా, అమెరికా, బ్రెజిల్, స్పెయిన్ లాంటి దేశాల్లో ఆ సంఖ్య 6వేలకుపైగా ఉంది.
మన పోరాటం గొప్పది..
ప్రపంచంలోని అగ్రగామి దేశాలన్నిటిలోకి భారత్ తన పౌరుల ప్రాణాలను కాపాడుకోవడంలో సఫలం అయింది. కరోనా రోగుల కోసం మనం 12వేలకుపైగా క్వారంటైన్ సెంటర్లు, 90లక్షలకుపైగా బెడ్స్ ఏర్పాటు చేసుకున్నాం. కరోనా టెస్టుల కోసం 2వేలకుపైగా ల్యాబ్స్ పనిచేస్తున్నాయి. మొత్తం టెస్టుల సంఖ్య 10కోట్లకు చేరువయ్యాం. కరోనా కట్టడిలో టెస్టులే కీలకంగా మారాయి. సేవే పరమధర్మంగా మన డాక్టర్లు, నర్సులు, పారిశుద్ధ్య కార్మికులు సహా ఫ్రంట్ లైన్ వారియర్లందరూ పనిచేస్తోన్నారు. ఇంత గొప్పగా పోరాటం సాగుతోన్న వేళ పండుగల సందర్భంలో అలసత్వం వద్దేవద్దు'' అని తెలిపారు.
కరోనా పోలేదు.. వ్యాక్సినే పరిష్కారం
మహమ్మారి పోయిందనో, ఇక వైరస్ అంతం అయిపోయిందనో అనుకోరాదు. ఇటీవల మనం గమనిస్తే దేశవ్యాప్తంగా కరోనా పట్ల నిర్లక్ష్య వైఖరి పెరిగిపోయింది. మాస్కులు లేకుండా బయటికి వస్తున్నవాళ్లందరూ.. తమను తాము, తమతోపాటు కుటుంబాన్ని రిస్కులో పడేస్తున్నారన్న విషయం మర్చిపోరాదు. కరోనా కేసులు తగ్గుతున్న దశలో మన నిర్లక్ష్యం వల్లే మళ్లీ కేసులు పెరుగుతున్నాయి. ఈ సందర్భంగా సంత్ కబీర్ దాస్ ఉవాచను మనం గుర్తుచేసుకోవాలి.. ‘‘పొలంలో ఏపుగా పెరిగిన పంటను చూసి మనందరం అతి విశ్వాసంతో సంతోషిస్తాం.. కానీ ఆ పంట ఇంటికి చేరే దాకా పని పూర్తయినట్లుకాదు'' అని సంత్ చెప్పారు. కరోనాకు విరుగుడు వ్యాక్సిన్ వచ్చేదాకా మనం పోరాడుతూ ఉండాల్సిందే
కష్టకాలంలో కచ్చితంగా పాటిద్దాం..
వ్యాక్సిన్ అందుబాటులోకి రాగానే దాన్ని సమర్థవంతంగా పంపిణీ చేయడానికి ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. ఇక్కడ మనం రామచరిత మానస్ ను గుర్తుచేసుకోవాలి.. అగ్ని, శత్రువు, రోగాన్ని ఏనాడూ తక్కువగా చూడొద్దని, కాబట్టే వాటిని పూర్తిగా నిర్మూలించాలని రామచరితలో రాసుంది. కాబట్టి కరోనాకు వ్యాక్సిన్ వచ్చేదాకా మనం కూడా దానిని తక్కువగా తీసుకోరాదు. నిజానికి పండుగలంటే మన జీవితంలో ఎంతో సంతోషకరమైన సందర్భాలు. కానీ ఈసారి కఠినమైన సమయాన్ని దాటుతున్నాం కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. రెండు గజాల దూరం, చేతులు శుభ్రం చేసుకోవడం, తప్పనిసరిగా మాస్కులు ధరించడం అనివార్యం. దీనిపై అందరూ విస్తృతంగా ప్రచారం చేయాలి. ఆరోగ్యంగా ఉంటూ.. దేశాన్ని ముందుకు తీసుకెళదాం.. దేశ ప్రజలకు దసరా, దీపావాళి, ఈద్, గురునానక్ పండుగల శుభాకాంక్షలు.. '' అంటూ ప్రధాని మోదీ ప్రసంగాన్ని ముగించారు.