మహారాష్ట్ర తర్వాత మరో రాష్ట్రంలోనూ వారాంతపు లాక్డౌన్: రేపట్నుంచే అమల్లోకి
భోపాల్: మధ్యప్రదేశ్ రాష్ట్రంలోనూ కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఈ క్రమంలో మధ్యప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే మహారాష్ట్ర ప్రభుత్వం వారాంతపు లాక్డౌన్ విధించగా.. తాజాగా, మధ్యప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఈ మేరకు నిర్ణయించింది.
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని పట్టణ ప్రాంతాల్లోనూ శుక్రవారం సాయంత్రం 6 గంటల నుంచి సోమవారం ఉదయం 6 గంటల వరకు లాక్డౌన్ విధిస్తున్నట్లు సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రకటించారు. నగరాల్లో కేసులు పెరుగుతున్న నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. పెద్ద నగరాల్లో కంటైన్మెంట్ జోన్లను పెంచుతున్నట్లు తెలిపారు.
మధ్యప్రదేశ్ రాష్ట్రంలో గత కొద్ది రోజులుగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో 4 వేలకుపైగా కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3.18 లక్షలు దాటింది. ప్రధాన నగరాలైన భోపాల్, ఇండోర్, జబల్పూర్, గ్వాలియర్లలో పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. రాష్ట్రంలోని మొత్తం కేసుల్లో అత్యధిక కేసులు ఈ రెండు నగరాల్లోనే ఉన్నాయి.
ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలోని నగరాల్లో వారాంతపు లాక్డౌన్ నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఇప్పటి వరకు 4వేల మందికిపైగా కరోనా మరణాలు సంభవించాయి. 2.88 లక్షల మంది కరోనా నుంచి కోలుకున్నారు. దేశంలో గత కొద్ది రోజులుగా లక్షకుపైగా కరోనా కేసులు నమోదవుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మహారాష్ట్రలో కర్ఫ్యూ, వారాంతపు లాక్డౌన్ అమలు చేస్తుండగా, గుజరాత్, ఢిల్లీల్లో కర్ఫ్యూ విధించారు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో కరోనా నిబంధనలను కఠినంగా అమలు చేయాలని సీఎం చౌహాన్ అధికారులను ఆదేశించారు. మాస్కులు, భౌతిక దూరం పాటించాలని ప్రజలకు పిలుపునిచ్చారు.