కరోనా: లాక్డౌన్పై స్పందించిన కేంద్రం.. ఇంటిపనులు రాజ్నాథ్కు.. మిగతావన్నీ మోదీనే..
ఇండియాలో కొవిడ్-19 కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. కేంద్ర ఆరోగ్య శాఖ అధికారిక లెక్కల ప్రకారం మంగళవారం మధ్యాహ్నం వరకు మొత్తం 4421 పాజిటివ్ కేసులు నమోదుకాగా, అందులో 114మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 325 మందికి వ్యాధి నయమైంది. దేశవ్యాప్తంగా వేల సంఖ్యలో అనుమానితుల్ని క్వారంటైన్లో ఉంచారు. కరోనా వైరస్ ఉధృతి తగ్గకపోగా, ప్రధాని మోదీ ప్రకటించిన 21 రోజుల దేశవ్యాప్త లాక్ డౌన్ గడువు దగ్గరపడుతుండటంతో.. తర్వాత ఏం చెయ్యాలనేదానిపై కేంద్రం భారీ కసరత్తు జరుపుతున్నది. తీవ్రస్థాయిలో సమాలోచనలు చేస్తున్నది. అందులో భాగంగా..

రాజ్నాథ్ అధ్యక్షతన హైలెవల్..
మంగళవారంతో దేశవ్యాప్త లాక్ డౌన్ 14వ రోజుకు చేరినట్లయింది. గడిచిన రెండు వారాల్లో దేశం ఎదుర్కొన్న సమస్యలు, ఆయా శాఖల ద్వారా అమలవుతోన్న పనుల వివరాలతోపాటు లాక్ డౌన్ కొనసాగింపు లేదా ఎత్తివేతపై కేంద్ర మంత్రుల హైలెవల్ మీటింగ్ ఒకటి ఢిల్లీలో జరిగింది. దీనికి రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ అధ్యక్షత వహించారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తోపాటు పియూష్ గోయల్, ప్రకాశ్ జవదేకర్, రాంవిలాస్ పాశ్వాన్, గిరిరాజ్ సింగ్, నరేంద్ర సింగ్ తోమర్,కిషన్ రెడ్డి తదితరులు భేటీలో పాలుపంచుకున్నారు. దాదాపు గంటన్నరపాటు జరిగిన సమావేశం అనంతరం మంత్రి తోమర్ కేంద్రం తరఫున మీడియాతో మాట్లాడారు.

ఇదీ కేంద్రం స్పందన..
రాజ్ నాథ్ నేతృత్వంలోని హైలెవల్ మీటింగ్ లో లాక్ డౌన్ అంశంపైనా లోతుగా చర్చించామని, ప్రధాని మోదీ సూచించినట్లు కరోనా ప్రభావం పెద్దగాలేని ప్రాంతాల్లో.. పాక్షికంగా లాక్ డౌన్ సడలింపునకు అవకాశాల్ని, అదేసమయంలో వివిధ రాష్ట్రాల నుంచి వస్తున్న రిక్వెస్ట్ లనూ పరిశీలించామని, వైరస్ మరింత వేగంగా విస్తరిస్తుండం, రాబోయే రోజుల్లో దాని ప్రభావంపైనా చర్చించామని నరేంద్ర సింగ్ తోమర్ చెప్పారు. అయితే లాక్ డౌన్ ముగింపునకు ఇంకా వారం రోజులు గడువు ఉన్నందున.. ఇప్పుడప్పుడే దానిపై తేల్చిచెప్పలేమని, మరిన్ని చర్చలు, సంప్రదింపులు జరిపిన తర్వాతే తుది నిర్ణయం తీసుకుంటామని తోమర్ స్పష్టం చేశారు.

కేసీఆర్ ప్రకటన తర్వాత..
కరోనా వ్యాప్తి చెందకుండా కేంద్రం ప్రకటించిన లాక్ డౌన్ ను మరికొన్ని వారాలు పొడగించాలని, ఈ మేరకు ప్రధాని మోదీని రిక్వెస్ట్ చేస్తానంటూ తెలంగాణ సీఎం కేసీఆర్ చేసిన కామెంట్లు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. కేసీఆర్ ప్రకటన తర్వాత మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రులు కూడా అదే డిమాండ్ చేయబోతున్నట్లు వార్తలు వచ్చాయి. ఈలోపు మేఘాలయ సీఎం కన్రాడ్ సంగ్మా సంచలన రీతిలో ఏప్రిల్ 15 నుంచి లాక్ డౌన్ ఎత్తేస్తామని ప్రకటించారు. దేశంలో ఇప్పటిదాకా ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాని మూడు రాష్ట్రాల్లో మేఘాలయ ఒకటి.

బాధ్యతల పంపకం..
లాక్ డౌన్ ప్రకటనలో లోపాలపై విమర్శలు ఎదురైన నేపథ్యంలో.. ఈసారి వేయబోయే అడుగుపై కేంద్రం జాగ్రత్తగా వ్యవహరిస్తున్నది. ప్రధానంగా మోదీ తీసుకోబోయే నిర్ణయానికి పార్టీ శ్రేణుల్ని, ఎన్డీఏ మిత్రుల్ని సంసిద్ధులు చేసే బాధ్యతను రక్షణ మంత్రి రాజ్ నాథ్ కు అప్పగించినట్లు తెలుస్తోంది. అదే సమయంలో ప్రతిపక్ష పార్టీల మధ్య ఏకాభిప్రాయసాధన బాధ్యతను ప్రధానమంత్రే భుజానికెత్తుకున్నారు. ప్రోటోకాల్ ప్రకారం ముఖ్యమత్రుల్ని సిద్ధం చేయాల్సింది ఆయనే కాబట్టి, ఆ పనిని కూడా సమర్థవంతంగా నిర్వహించే ప్రయత్నంలో ఉన్నారు.

మోదీ ఆల్ పార్టీ మీటింగ్..
లోక్ సభ, రాజ్యసభల్లో ఆయా పార్టీల ఫ్లోర్ లీడర్లతో ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం సమాలోచనలు జరుపనున్నారు. ఢిల్లీ నుంచి ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పార్టీల నేతలతో మాట్లాడుతారు. ప్రధానంగా లాక్ డౌన్ అంశంపైనే చర్చ జరిగే అవకాశముందని కేంద్ర ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. తెలుగు రాష్ట్రాల తరఫున మోదీతో భేటీకి వైసీపీ ఎంపీలు విజయసాయిరెడ్డి, మిథున్ రెడ్డి, టీఆర్ఎస్ నుంచి కే. కేశవరావు, నామా నాగేశ్వరరావు, టీడీపీ తరఫున గల్లా జయదేవ్ మాట్లాడనున్నారు.












Click it and Unblock the Notifications