లోక్సభ నిరవధిక వాయిదా: రాజ్యసభ కూడా.. 8 రోజుల ముందే ముగింపు..
కరోనా వైరస్ నేపథ్యంలో పార్లమెంట్ ఉభయ సభలు నిర్ణీత షెడ్యూల్ కన్నా ముందే వాయిదా పడ్డాయి. 8 రోజుల ముందుగానే సభలను వాయిదా వేస్తున్నట్టు లోక్ సభ స్పీకర్, రాజ్యసభ చైర్మన్ ప్రకటించారు. ఈ నెల 14వ తేదీన పార్లమెంట్ వర్షకాల సమావేశాలు ప్రారంభమయిన సంగతి తెలిసిందే. అక్టోబరు 1వ తేదీ వరకు జరగాల్సిన సమావేశాలు కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ముందుగానే ముగిశాయి.
కరోనా వైరస్ వల్ల సమావేశాలను వాయిదా వేస్తున్నట్టు రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు బుధవారం ప్రకటించారు. అనంతరం లోక్సభ సమావేశాలను కూడా నిరవధికంగా వాయిదా వేస్తున్నట్టు స్పీకర్ ఓం బిర్లా తెలిపారు. పది రోజులపాటు సమావేశాలు జరగగా.. కొత్తగా 16 బిల్లులను ప్రభుత్వం ప్రవేశపెట్టింది. 10 సిట్టింగులలో 25 బిల్లులను పార్లమెంట్ ఆమోదించింది. కార్మిక సంస్కరణలకు సంబంధించిన మూడు బిల్లులు బుధవారం ఆమోదం పొందాయి.

పారిశ్రామిక సంబంధాలు, సామాజిక భద్రత, ఉద్యోగ భద్రతకు సంబంధించిన బిల్లుల ప్రకారం 300 మంది ఉద్యోగులు పనిచేసే సంస్థలు ఉద్యోగాల నియామకాలు, తొలగింపునకు అనుమతి ఇస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. పౌర విమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్పూరి సహా అక్టోబరులో పదవీ విరమణ చేయనున్న సభ్యులకు రాజ్యసభ వీడ్కోలు పలికింది.
వివాదాస్పద వ్యవసాయ బిల్లులు చట్టరూపం దాల్చడంతో రాజ్యసభలో రగడ జరిగిన సంగతి తెలిసిందే. విపక్ష 8 మంది ఎంపీలు రాత్రంతా పార్లమెంట్ ఆవరణలో నిరసన చేపట్టారు. తర్వాత శరద్ పవార్, ఇతర ముఖ్య నేతలు ప్రభుత్వ తీరును తప్పుపట్టారు.












Click it and Unblock the Notifications