కరోనా ఎఫెక్ట్: ఎంపీల జీతంలో 30 శాతం కోత: బిల్లుకు లోక్సభ ఆమోదం
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి కారణంగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఎంపీల జీతాల్లో 30 శాతం కోత విధిస్తూ ప్రవేశపెట్టిన బిల్లుకు లోక్సభ మంగళవారం ఆమోదం తెలిపింది. దీంతో ఒక సంవత్సరం పాటు ఎంపీల జీతంలో 30 శాతం కోత విధించనున్నారు.
కరోనాపై పోరాటంలో నిధుల కొరత ఉండకూడదన్న ఉద్దేశంతో ఏడాదిపాటు ఎంపీల జీతాల్లో 30 శాతం కోత విధిస్తూ కేంద్ర కేబినెట్ ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో దానికి సంబంధించిన బిల్లును సోమవారం సభలో ప్రవేశపెట్టగా.. మంగళవారం ఆమోదం పొందింది.

పార్లమెంటు సభ్యుల జీతం, భత్యాలు, పెన్షన్ (సవరణ) బిల్లు, 2020 దిగువ సభలో సోమవారం ప్రవేశపెట్టబడింది. ఇది పార్లమెంటు సభ్యుల జీతం, భత్యాలు, పెన్షన్ (సవరణ) ఆర్డినెన్స్, 2020 ను భర్తీ చేస్తుంది. కాగా, ఈ ఆర్డినెన్స్ను ఏప్రిల్ 6 న కేబినెట్ క్లియర్ చేసి మరుసటి రోజు ప్రకటించింది.
ప్రధానమంత్రి, కేంద్రమంత్రులతోపాటు ఎంపీలందరి వేతనాల్లో ఏప్రిల్ నుంచి ఏడాదిపాటు 30 శాతం కోత పడనుంది. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, పలువురు గవర్నర్లు, లెఫ్టినెంట్ గవర్నర్లు స్వచ్ఛందంగా వేతనాల కోతకు ముందుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ మొత్తం సంఘటిత నిధికి జమకానుంది. మరోవైపు, కరోనా వ్యాప్తిని అడ్డుకునే చర్యల్లో భాగంగా ఎంపీ ల్యాడ్స్ నిధులను కూడా రెండేళ్లపాటు తాత్కాలికంగా రద్దు చేస్తూ కేంద్రం ఇప్పటికే నిర్ణయం తీసుకుంది.
కాగా, దేశంలో కరోనా కేసులు రోజు రోజుకు భారీగా పెరిగిపోతున్నాయి. అయితే, కోలుకుంటున్నవారి సంఖ్య కూడా అదే స్థాయిలో ఉండటం ఊరటనిచ్చే అంశంగా మారింది. దేశంలో ఇప్పటి వరకు 49,33,188 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా,
9,92,850 యాక్టివ్ కేసులున్నాయి. 38,58,815 మంది కోలుకున్నారు. ఇప్పటి వరకు కరోనా బారినపడి 80,833 మంది మరణించారు.












Click it and Unblock the Notifications