మోడీ - రాహుల్ కంటే, మోడీ - చంద్రబాబు యుద్ధమే ఆసక్తిగా ఎందుకు మారింది?
ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీతో సమావేశం అవడాన్ని దేశంలోని అన్ని రాజకీయ పార్టీలు ఆసక్తితో చూశాయి. 2018 నవంబర్ 19వ తేదీ దేశ రాజకీయ చరిత్రలో గుర్తుండిపోయే రోజు . ఎందుకంటే నరేంద్ర మోడీ ప్రభుత్వానికి లేదా బీజేపీ పార్టీకి వ్యతిరేకంగా అడుగులు పడిన రోజు. అయితే చంద్రబాబును దగ్గరగా చూస్తున్న వారు మాత్రం దీనికి మరో భాష్యం చెబుతున్నారు. చంద్రబాబు పార్టీ తెలుగుదేశంపై రాష్ట్రంలో వ్యతిరేకత ఉన్న నేపథ్యంలో దాన్ని చెరిపివేసేందుకే బీజేపీ వ్యతిరేక పార్టీ అధినేతలను కలుస్తున్నారని చెబుతున్నారు. మోడీ విధానాలను ముందునుంచి వ్యతిరేకిస్తున్న వారిలో మమతా బెనర్జీ ముందు వరసలో ఉన్నారు. అదే సమయంలో ఆమె బీజేపీకి వ్యతిరేక శక్తులన్నీ ఒక్కటి కావాలని కోరుకున్న వారిలో మమత ముందువరసలో ఉన్నారు. ఇదిలా ఉంటే బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకతాటిపైకి తీసుకొచ్చే కార్యాన్ని చంద్రబాబు తన భుజాల మీద వేసుకున్నారన్న సంకేతాలు కూడా పంపారు. ఇందులో భాగంగానే మమతకంటే ముందు కర్నాటక ముఖ్యమంత్రి హెచ్డీ కుమారస్వామి, దేవెగౌడ, డీఎంకే అధినేత స్టాలిన్ను కూడా కలిశారు. ఇక మమతా బెనర్జీ కోల్కతాలో జనవరి 19న తలపెట్టనున్న ర్యాలీలో కూడా చంద్రబాబు పాల్గొననున్నారు.
ఇక చంద్రబాబు కాకుండా మరో నేత ఎవరైనా సరే బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేయడంలో విఫలమయ్యేవారే అని చంద్రబాబుకున్న సుదీర్ఘ రాజకీయ అనుభవంతోనే చాలా పార్టీలు ఆయనపై నమ్మకం ఉంచాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. చంద్రబాబు నాయుడు దీనికి నేతృత్వం వహిస్తే కచ్చితంగా మంచి ఫలితాలు వస్తాయనే ఆలోచనలో నేతలున్నట్లు సమాచారం. అందుకే బాబుపై వారు భరోసాతో ఉన్నారని రాజకీయ విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు.
మోడీ వ్యతిరేక కూటమికి చంద్రబాబు నాయకత్వమే ఎందుకు మేలు?
మోడీ వ్యతిరేక కూటమికి చంద్రబాబు నాయుడు నేతృత్వం వహిస్తేనే బాగుంటుందని చాలా మంది నేతలు భావిస్తున్నారు. ఇందుకు కారణం చంద్రబాబు ఇమేజ్. సాధారణంగా మంచి పరిపాలనాధక్షత ఉన్న నేతగా చంద్రబాబుకు గుర్తింపు ఉంది. సాంకేతికతను వినియోగించే ముఖ్యమంత్రిగా కూడా ఆయనకు పేరుంది. ఆ తర్వాత ఇదే పేరును ప్రధాని మోడీ సంపాదించారు. ఇక 68 ఏళ్ల వయస్సులో కూడా చంద్రబాబు దేశరాజకీయాల్లో తనదైన ముద్ర వేస్తున్నారన్న ప్రచారం కూడా ఉంది. మమతా బెనర్జీ, మాయావతి, అఖిలేష్ యాదవ్ల కంటే చంద్రబాబు నాయకత్వానికే చాలామంది మద్దతు పలుకుతున్నారు. అంతేకాదు దక్షిణ భారతదేశంలో చంద్రబాబుకు మంచి పట్టు ఉండటం కూడా కలిసొచ్చే అంశం. అందుకే మోడీ వ్యతిరేక శక్తులకు చంద్రబాబు నాయకత్వం అయితేనే బాగుంటుందన్న మాట వినిపిస్తోంది.
నాడు గుజరాత్ ముఖ్యమంత్రిగా మోడీ తన పాలనా ముద్ర ఎలాగైతే వేశారో చంద్రబాబు కూడా అదే స్థాయిలో ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రిగా తన పాలనా ముద్ర వేశారు. ఒక వేళ మోడీకి ప్రత్యామ్నాయంగా దేశం ఎవరి నేతృత్వమైన కోరుకుంటుందంటే అది చంద్రబాబు నాయుడే అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదని రాజకీయవిశ్లేషకులు చెబుతున్నారు. ఇక మాయావతి, అఖిలేష్ యాదవ్లను ఒక సామాజిక వర్గానికి చెందిన నేతగానే చాలామంది భావిస్తుండగా... దేశ రాజకీయాల్లో చంద్రబాబును మాత్రం ఒక పాలనాధక్షత ఉన్న వ్యక్తిగానే చూస్తున్నారు.
రాహుల్ నేతృత్వం కంటే బాబు నాయకత్వాన్నే సమర్థిస్తున్న ప్రాంతీయ పార్టీలు
ఇక చంద్రబాబు నాయుడు మోడీ వ్యతిరేక శక్తులను ఒకే వేదికపైకి తీసుకొచ్చే ప్రయత్నాలు కొనసాగిస్తుండగా ఇందుకు కాంగ్రెస్ సంపూర్ణ సహాయసహకారాలు అందిస్తోంది. ఇందుకు కారణం చాలా రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు మోడీకి వ్యతిరేకంగా కాంగ్రెస్తో జతకట్టాలని భావిస్తున్నాయి. ఈ క్రమంలోనే రాహుల్ గాంధీ కాకుండా చంద్రబాబు నాయుడు నాయకత్వ బాధ్యతలు తీసుకుంటే కాంగ్రెస్కు మద్దతు ఇవ్వాలా లేదా అని మీమాంసలో ఉన్న పార్టీలు సైతం హస్తం పార్టీతో కలిసి వచ్చే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అంతేకాదు ఓ ప్రాంతీయపార్టీ నాయకుడే నేతృత్వం వహించడం మంచి సంకేతాలు పంపినట్లు అవుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. రాహుల్ గాంధీ నాయకత్వాన్ని కూడా చాలా మంది ప్రాంతీయ పార్టీ అధినేతలు ఒప్పుకోని నేపథ్యంలో అపార అనుభవం ఉన్న చంద్రబాబు అయితేనే బాగుంటుందని ఇందులో భాగంగానే ఆయనకు మద్దుతు పలుకుతున్నట్లు పొలిటికల్ అనలిస్టులు చెబుతున్నారు.
దేశరాజకీయాల్లో ఎప్పుడో చక్రం తిప్పిన అనుభవజ్ఞుడు చంద్రబాబు
ఇక బీజేపీతో నాలుగున్నర సంవత్సరాలు కాపురం చేసిన చంద్రబాబు ఆ తర్వాత బీజేపీకి వ్యతిరేకంగా కూటమి కట్టడం అందులో కాంగ్రెస్తో జతకట్టడంపై పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు. నాడు కాంగ్రెస్కు వ్యతిరేకంగా ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించారు. అయితే నేడు బీజేపీకి వ్యతిరేకంగా అదే తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు దేశంలోని బీజేపీ వ్యతిరేక శక్తులను ఒక్కతాటిపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. రాజకీయాల్లో మోడీకంటే తానే సీనియర్ అని చంద్రబాబు చెప్పడం, తనకున్న రాజకీయ అనుభవం రెండు కలిపి గతంలో అంటే మోడీ ఇంకా గుజరాత్ రాజకీయాల్లో ఉన్నసమయంలోనే దేశరాజకీయాల్లో చక్రం తిప్పడం వంటి అంశాలు ఇప్పుడు కలిసొస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.