లోక్పాల్ బిల్లుకు రాజ్యసభ ఆమోదం: రేపు లోకసభలో
న్యూఢిల్లీ: సవరించిన లోక్పాల్ బిల్లును రాజ్యసభ మంగళవారంనాడు ఆమోదించింది. రేపు బుధవారం లోక్పాల్ బిల్లు లోకసభలో చర్చకు రానుంది. లోక్పాల్ బిల్లును ఆమోదించినందుకు దీక్ష చేస్తున్న అన్నా హజారే రాజ్యసభకు ధన్యవాదాలు తెలిపారు. అన్నా హజారే శిబిరంలో సంబరాలు చేసుకుంటున్నారు. రేపు బుధవారం లోకసభలో బిల్లు ఆమోదం పొందిన తర్వాత దీక్షను విరమించనున్నట్లు అన్నా హజారే చెప్పారు.
అవినీతిని నిరోధించడానికి తలపెట్టిన లోక్పాల్ బిల్లును సమాజ్వాదీ పార్టీ వ్యతిరేకించింది. బిల్లుకు వ్యతిరేకంగా వాకౌట్ చేసింది. బిజెపి సూచించిన సవరణను బిల్లులో చేర్చడానికి ప్రభుత్వం అంగీకరించింది. ఏ అధికారిపైన అయినా అవినీతి ఆరోపణలు వస్తే నోటీసు ఇవ్వకుండా సోదాలు నిర్వహించడానికి సిబిఐకి లేదా పోలీసులకు ఆ సవరణ అధికారం సంక్రమింపజేస్తుంది.
రాజకీయాలకు అతీతంగా ముందుకు వచ్చి లోక్పాల్ బిల్లును సమర్థించాలని న్యాయశాఖ మంత్రి కపిల్ సిబాల్ అన్ని పార్టీలను కోరారు. బిజెపికి చెందిన ప్రతిపక్ష నాయకుడు అరుణ్ జైట్లీ బిల్లుకు మద్దతు తెలిపారు.
బిల్లుపై బిజెపి, కాంగ్రెసు మధ్య రహస్య అవగాహన కుదిరిందని, ఈ అవగాహనను చూస్తుంటే ఆంఖో హీ ఆంఖో మే హిషారా హోగయా అనే హిందీ సినిమా పాట గుర్తుకు వస్తోందని సిపిఎం సభ్యుడు సీతారాం ఏచూరి అన్నారు. బిల్లుకు సంబంధించి సీతారాం ఏచూరి ప్రతిపాదించిన సవరణ వీగిపోయింది.