అనంత పద్మనాభస్వామి సంపద: మళ్లి లెక్కింపు
న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన అనంత పద్మనాభస్వామి ఆలయ సంపదను మరో సారి లెక్కించాలని మాజీ కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) వినోద్ రాయ్ ని సుప్రీం కోర్టు ఆదేశించింది.
ఈ మేరకు సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ హెచ్.ఎల్. దత్తూతో కూడిన ధర్మాసనం శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. తాను గతంలో చేసిన ఆడిట్ పై అసంతృప్తి వ్యక్తం చేసిన వినోద్ రాయ్ అవకాశం ఉంటే మరో సారి తనిఖీలు చెయ్యడానికి సిద్దంగా ఉన్నానని చెప్పారు.
ఈ నేపధ్యంలో సుప్రీం కోర్టు ఆయనకు ఈ అవకాశం ఇచ్చింది. కేరళలోని తిరువనంతపురంలోని అనంత పద్మనాభస్వామి దేవాలయం నేల మాళిగలో లభించిన రూ. లక్ష కోట్లకు పైగా విలువైన సంపదను గతంలో లెక్కించారు.
అయితే ఆలయంలోని కొందరు పెద్దలు రహస్యంగా సంపదను కొల్లగొడుతున్నారని ఆరోపణలు వచ్చాయి. దీనిపై సుప్రీం కోర్టు నియమించిన సొలిసిటర్ జనరల్, అమికస్ క్యూరీ గోపాల్ సుబ్రమణి 2014 ఏప్రిల్ 18వ తేదిన సమర్పించిన నివేదికలో ఆ అనుమానాలకు బలం చేకూరింది.

ఆలయ నేల మాళిగలోని సంపద లెక్కిస్తున్న సమయంలో కల్లారా-బీ అనే గదిని తెరవనివ్వకుండా ఆలయ ట్రస్టీలు అడుకున్నారు.అయితే ఆ గదిని కొనేళ్ల క్రితం తెరిచారని తమ దగ్గర ప్రత్యక్ష సాక్షాలు ఉన్నాయని గోపాల్ సుబ్రమణి ఇచ్చిన నివేదికలో పొందుపరిచారు.
బంగారు పూత వేసే యంత్రం ఇటివల ఆలయం ఆవరణంలో లభించిందని, కొందరు పెద్దలు నిజమైన బంగారు సంపదను తరలించి, నకిలి బంగారు నగలు అక్కడ పెడుతున్నారని అనుమానాలు ఉన్నాయని, శాస్త్రీయ పద్దతిలో ఆడిటింగ్ నిర్వహించాలని సిఫార్సు చేశారు.
ఈ నేపద్యంలోనే వినోద్ రాయ్ సంపద లెక్కలపై ఆడిటింగ్ జరిపారు. ఈ ఆడిటింగ్ జరిగి ఏడాదిన్నర పూర్తి అయ్యింది. అయితే ఇప్పుడు మళ్లి ఆలయ సంపద పై ఆడిటింగ్ చేయ్యాలని సుప్రీం కోర్టు ఆదేశాలు ఇవ్వడం ప్రాధాన్యత సంతరించుకునింది.












Click it and Unblock the Notifications