లాటరీ స్కాం: కోయంబత్తూరు మార్టీన్ కు చెందిన రూ. 595 అక్రమ ఆస్తులు సీజ్, రారాజుగా జల్సాలు !
కోయంబత్తూరు: కోయంబత్తూరుకు చెందిన లాటరీ ఏజెంట్ స్యాంటియాగో మార్టిన్ అలియాస్ మార్టీన్ కు చెందిన నివాసంతో పాటు కార్యాలయాల మీద దాడులు చేసిన ఆదాయపన్ను శాఖ అధికారులు (ఐటీ శాఖ) సుమారు రూ. 595 కోట్ల విలువైన అక్రమ ఆస్తులను స్వాదీనం చేసుకున్నారు.
లాటరీ స్కాంలో అక్రమ ఆస్తులను లోక్ సభ ఎన్నికల్లో ఖర్చు చేశారా ? అనే కోణంలో ఆదాయపన్ను శాఖ అధికారులు విచారణ చేస్తున్నారు. ఈ సందర్బంలో తమిళనాడులో ఆదాయపన్ను శాఖ అధికారులు మరన్ని సోదాలు చేసే అవకాశం ఉందని సమాచారం. కోయంబత్తూరులోని 20 ప్రాంతాలతో సహ దేశంలోని 70 ప్రాంతాల్లో ఐటీ శాఖ అధికారులు సోదాలు చేశారు. ఐటీ శాఖ అధికారుల దాడులు మరన్ని కొనసాగే అవకాశం ఉంది. ఐటీ శాఖ సోదాల్లో బంగారంతో పాటు అక్రమ ఆస్తుల పత్రాలు స్వాధీనం చేసుకున్నారు.
లాటరీ స్కాం రారాజు
కోయంబత్తూరులోని గాంధీనగర్ లో నివాసం ఉంటున్న మార్టీన్ ఒక సాదారణ లాటరీ ఏజెంట్. పేదలు, మధ్యతరగతి వారిని టార్గెట్ చేసుకుని లాటరీ టిక్కెట్లు విక్రయించేవాడు. లాటరీ స్కాంతో మార్టీన్ రూ. 7,000 కోట్లు సంపాదించాడని వెలుగు చూసింది. రూ. 2,000 కోట్ల అక్రమ ఆస్తులతో మార్టీన్ రారాజుగా జీవనం సాగించాడు. మార్టీన్ కథతో ఒక సినిమా తీయ్యడానికి అవకాశం ఉందని సమాచారం.
వ్యాపారవేత్తలను మించిపోయాడు
తమిళనాడుకు చెందిన 17 స్కీమ్ లు, సిక్కీం ప్రభుత్వానికి చెందిన 28 స్కీంలు, అరుణాచల్ ప్రదేశ్ కు చెంది 6 స్కీంలను సులభంగా అమలు చేసిన మార్టీన్ ఆ కాలంలో ప్రతిరోజూ సంపాధించిన లాభాలు ఐటీ దిగ్గజం ఇన్ఫోసిన్ నారాయణమూర్తి, వ్యాపారవేత్త అంబానీల సంపాదన కంటే ఎక్కువగా ఉండేదని అధికారులు గుర్తించారు.
ఆత్మహత్య చేసుకున్న పీఏ
లాటరీ స్కాంకు సంబందించి మార్టీన్ కు చెందిన హోమియోపతి కాలేజ్ కు చెందిన అకౌంటెంట్ పళనిస్వామిని అరెస్టు చేసి విచారణ చేశారు. అధికారులు అరెస్టు చేసి విచారణ చేసిన అనంతరం పళనిస్వామి చేతి నరాలను కోసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మార్టీన్ కు పళనిస్వామి పీఏగా పని చేశాడని అధికారుల విచారణలో వెలుగు చూసింది.
మార్టీన్ మీద 14 కేసులు
లాటరీ స్కాం ప్రధాన నిందితుడు మార్టీన్ మీద 14కు పైగా కేసులు ఉన్నాయి. భూ కబ్జాలు, అక్రమ లాటరీలు, మోసం తదితర కేసులు మార్టీన్ మీద నమోదు అయ్యాయి. డీఎంకే పార్టీతో సన్నిహితంగా ఉన్న మార్టీన్ పలు భూ కబ్జాలు చేశారని వెలుగు చూడటంతో గతంలో అతని కార్యాలయాల మీద సీబీఐ అధికారులు దాడులు చేశారు. మార్టీన్ దగ్గర పీఆర్వోగా పని చేసిన హారి రాజన్ ను అధికారులు అరెస్టు చెయ్యడంతో అతను ప్రస్తుతం బెంగళూరు సెంట్రల్ జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు.
బీజేపీ మిత్రపక్షంలో మార్టీన్ భార్య
2014 లోక్ సభ ఎన్నికల సందర్బంలో మార్టీన్ భార్య లీమా రోస్ ఇండియా జననాయక కచ్చి (ఐజేకే) పార్టీలో చరుకుగా ఉన్నారు. ఆ సందర్బంలో తమిళనాడులోని ఎన్ డీఏ కూటమిలో ఐజేకే కూడా భాగస్వామ్యంగా ఉంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా అప్పుడు కోయంబత్తూరులో జరిగిన భారీ ర్యాలీలో ప్రధాని నరేంద్ర మోడీతో కలిసి మార్టీన్ భార్య లీమా రోస్ ఒకే వేదిక మీద కనిపించారు.