మృత్యు ఫలం: వందలమంది చిన్నారుల మరణానికి ‘లిచీ’యే కారణం
బీహార్ రాష్ట్రంలో గత కొద్ది సంవత్సరాలు గుర్తు తెలియని వ్యాధితో చిన్నారులు మృతువాత పడుతున్న విషయం తెలిసిందే. ఈ ఆకస్మికర మరణాలకు శాస్త్రవేత్తలు కారణం కనుగొన్నారు.
న్యూఢిల్లీ: బీహార్ రాష్ట్రంలో గత కొద్ది సంవత్సరాలు గుర్తు తెలియని వ్యాధితో చిన్నారులు మృతువాత పడుతున్న విషయం తెలిసిందే. ఈ వ్యాధితో అకస్మాత్తుగా చిన్నారులు అస్వస్థతకు గురై ప్రాణాలు కోల్పోతున్నారు. అధిక జ్వరం, స్పృహ కోల్పోవడం లాంటి లక్షణాలతో మరణిస్తున్నారు.
ఆ ఆకస్మికర మరణాలకు శాస్త్రవేత్తలు కారణం కనుగొన్నారు. లిచీ అనే పండును తినడం వల్లే నారాల సంబంధిత వ్యాధితో చిన్నారులు మరణిస్తున్నట్లు శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్, యూఎస్ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ సంస్థలకు చెందిన పరిశోధకులు ఈ అంశాన్ని వెల్లడించారు.
ముజాఫర్ జిల్లాకు చెందిన 15 ఏళ్ల లోపు ఇద్దరు యువకులపై జరిపిన పరిశోధన ఆధారంగా శాస్త్రవేత్తలు ఈ నిర్ధారణకు వచ్చారు. లిచీ పండులో ఉన్న హైపోగ్లైసిన్ ఏ లేదా మెథిలినీసైక్లోప్రొఫిల్గ్లైసిన్ లాంటి సహజమైన విషపూరిత రసాయనాలు చిన్నారుల ప్రాణాలు తీస్తున్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు.
ఈ పండ్లు తినడం వల్లే చిన్నారుల శరీర భాగాలు వంకర్లు పోవడం, కోమాలోకి పోవడం జరుగుతోందని వారు నిర్ధారించారు. ఈ పండ్లలో విషపూరిత పదార్థాలున్నట్లు వారు చెబుతున్నారు. కాగా, ఈ వ్యాధి బారిన పడ్డ 390మంది చిన్నారుల్లో 122మంది ప్రాణాలు కోల్పోవడం ఈ వ్యాధి తీవ్రతను తెలియజేస్తోంది. ఈ క్రమంలో చిన్నారులు లిచీ పండ్లకు దూరంగా ఉండటమే మంచిదని చెబుతున్నారు.