పరువు హత్య?: అనుమానాస్పద స్థితిలో ప్రేమజంట మృతి
జైపూర్: రాజస్థాన్ రాష్ట్రంలోని నైన్వా ప్రాంతంలో ఓ ప్రేమ జంట అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఖాన్పోల్ ప్రాంతానికి చెందిన గీతా సైనీ(16), సోను బర్హత్(18) ఇద్దరు ప్రేమించుకున్నారు. ఆదివారం వారిద్దరూ అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు.
కాలనీలోని ఓ రైతు గదిలో సీలింగ్ ఫ్యాన్కు వీరు వేలాడుతూ కనిపించడంతో స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. మృతదేహాలను పరిశీలించగా, సోను జేబులో ఓ లేఖ దొరికినట్లు పోలీసులు తెలిపారు.
ఆ లేఖలో వారిద్దరూ ప్రేమించుకుంటున్నారని మాత్రమే రాసి ఉందని, ఆత్మహత్యకు సంబంధించిన కారణాలేవీ తెలపలేదని చెప్పారు. కాగా, ఇది ఆత్మహత్య కాదని, పరువు హత్య అని మృతుడి మిత్రులు ఆరోపిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు, దర్యాప్తు చేస్తున్నారు.
తీవ్రవాదుల దాడి: 8 మంది భద్రత సిబ్బంది కాల్చివేత
కోహిమా: నాగాలాండ్లోని మోన్ జిల్లాలో ఆదివారం తీవ్రవాదులు జరిపిన మెరుపుదాడిలో ఎనిమిది మంది భద్రత సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. వారిలో ఏడుగురు అసోం రైఫిల్స్కు చెందినవారు కాగా, ఒకరు టెరిటోరియల్ ఆర్మీ జవాను.
తాగునీటిని తెచ్చుకోవడం కోసం ఛంగ్లాన్సు అనే గ్రామానికి వారు ట్యాంకరుతో పాటు వెళ్లారు. ఆ సమయంలో తీవ్రవాదులు చుట్టుముట్టి కాల్పులు జరిపారు. ఎదురుదాడిలో ఒక తీవ్రవాది ప్రాణాలు కోల్పోగా మరికొందరు గాయపడ్డారు.