LPG వినియోగదారులకు అలర్ట్- అక్టోబర్ 1 నుంచి గ్యాస్ కావాలంటే..?
దేశంలో సబ్సిడీపై అందిస్తున్న ఎల్పీజీ (LPG) సిలెండర్లు దుర్వినియోగం కాకుండా చూసేందుకు కేంద్రం ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటూనే ఉంది. అయినా భారీ ఎత్తున ఏదో విధంగా అవి దుర్వినియోగం అవుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో మరోసారి అక్టోబర్ 1 నుంచి ఎల్పీజీ సిలెండర్ల సబ్సిడీకి నిబంధనల్ని కఠినతరం చేస్తూ కేంద్రం తాజాగా నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు అక్టోబర్ 1 నుంచి గృహ వినియోగదారులు రాయితీ ధరలకు రీఫిల్స్ బుక్ చేసుకోవాలంటే తప్పనిసరిగా బయోమెట్రిక్ ఆధార్ ధృవీకరణ (BAA) పూర్తి చేసి ఉండాలని కేంద్రం తెలిపింది.
సబ్సిడీతో కూడిన ఎల్పీజీ కేవలం అర్హత కలిగిన కుటుంబాలకు మాత్రమే చేరేలా చూడటమే దీని లక్ష్యమని కేంద్రం తెలిపింది.
ప్రతి కనెక్షన్ను ఆధార్ ధృవీకరించిన వినియోగదారునికి అనుసంధానించడం వల్ల, రాయితీతో కూడిన గృహ సిలిండర్లను వాణిజ్య, పారిశ్రామిక అవసరాలకు మళ్లించకుండా నివారించవచ్చని పేర్కొంది. నకిలీ, అనర్హమైన కనెక్షన్లను తొలగించవచ్చని, సబ్సిడీ పంపిణీని పారదర్శకంగా, లక్షితంగా చేయవచ్చని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఓ ప్రకటనలో పేర్కొంది. ఈ ప్రక్రియ ఏ నిజమైన కుటుంబానికి ఎల్పిజిని నిరాకరించడానికి ఉద్దేశించినది కాదని తెలిపింది. ప్రతి అర్హతగల వినియోగదారుడు దీనిని పూర్తి చేయడానికి అనేక సులభమైన మార్గాలు ఉన్నాయని కూడా తెలిపింది.

ఇందులో ఇప్పటికే బయో మెట్రిక్ ఆధార్ ఆథెంటికేషన్ లేదా ఈకేవైసీ (eKYC)ఇప్పటికే పూర్తి చేసిన వినియోగదారులు దీన్ని మళ్లీ చేయనవసరం లేదని, వారికి రీఫిల్ బుకింగ్లు యథావిధిగా కొనసాగుతాయని తెలిపింది. ఇది పూర్తి చేయని వారికి, ధృవీకరణ పూర్తయిన తర్వాత సబ్సిడీతో రీఫిల్ బుకింగ్ సౌకర్యం కల్పిస్తారు. గ్యాస్ సిలెండర్ డెలివరీ సమయంలో, డెలివరీ చేసే వ్యక్తి ఆయిల్ కంపెనీల మొబైల్ యాప్లను ఉపయోగించి అక్కడికక్కడే ధృవీకరణను పూర్తి చేయవచ్చని తెలిపింది. వినియోగదారులు ధృవీకరణను పూర్తి చేయడానికి తమ గ్యాస్ ఏజెన్సీ ఆఫీసుకు కూడా వెళ్లవచ్చని, మొబైల్ యాప్ ద్వారా తమకు తామే పూర్తి చేసుకోవచ్చని వెల్లడించింది. సెప్టెంబర్ 19 నాటికి దేశంలో 27.43 కోట్ల మంది యాక్టివ్ గృహ వినియోగ ఎల్పీజీ వినియోగదారులు ఈకేవైసీ పూర్తి చేశారని, ఇది ఇది మొత్తం వినియోగదారులలో 89.9 శాతమని వెల్లడించింది. మిగిలిన వినియోగదారుల్ని ఇప్పుడు ఈకేవైసీ పూర్తి చేసుకోవాలని సూచిస్తోంది.














Click it and Unblock the Notifications
