ఆధునాతన సౌకర్యాలతో పార్లమెంటుకు కొత్త భవనం!
న్యూఢిల్లీ: మన దేశానికి అధునాతన సాంకేతిక సౌకర్యాలతో కొత్త పార్లమెంటు భవనం సాకరమయ్యే అవకాశం కనిపిస్తోంది. నూతన ప్రాంగణ నిర్మాణ అవసరాన్ని సూచిస్తూ లోక్సభ స్పీకర్ సుమిత్రా మహాజన్.. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం వెంకయ్య నాయుడుకు ఒక లేఖ రాశారు. 88ఏళ్ల క్రితం నిర్మించిన ప్రస్తుత పార్లమెంటు భవనం శిథిలావస్థకు చేరుకునేలా ఉందని, దీనికితోడు పెరుగుతున్న అవసరాలకు సరిపడా స్థలం అందుబాటులో లేదని ఆమె పేర్కొన్నారు.
కాగా, ఈ ప్రతిపాదనను పట్టణాభివృద్ధి శాఖ.. కేంద్ర కేబినెట్ ముందు ఉంచుతుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. కొత్త భవన నిర్మాణం కోసం స్పీకర్ పలు కారణాలను తన లేఖలో వివరించారు. రాజ్యాంగంలోని 81వ అధికరణలోని క్లాజ్ (3) ప్రకారం.. 2026 తర్వాత లోక్సభలోని సీట్ల సంఖ్య పెరిగే అవకాశం ఉందని ఆమె చెప్పారు.
అయితే ప్రస్తుతం పార్లమెంటు భవనంలో సీటింగ్ సామర్థ్యం 550 వరకే ఉందని, వాటిని పెంచుకోవడానికి ఇక అవకాశం లేదన్నారు. సదరు అధికరణం ప్రకారం.. చివరి జనాభా లెక్కలు (2021 నాటివి) ఆధారంగా ప్రాతినిధ్యాన్ని పెంచాల్సి ఉంటుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. అయితే పార్లమెంటు ప్రాంగణ భవనం పాతదై పోతుండటం, కార్యకలాపాలు విస్తరించడం, సిబ్బంది పెరిగిపోవడం వంటి కారణాల వల్ల భవనానికి ప్రమాద ఘంటికలు మోగుతున్నాయని స్పీకర్ తన లేఖలో పేర్కొన్నారు.
ఈ పరిస్థితుల్లో అధునాతన పార్లమెంటు భవన నిర్మాణాన్ని చేపట్టాల్సిన అవసరం ఉందని ఆమె వివరించారు. ప్రస్తుత భవనం 1927లో ప్రారంభించారని, అప్పట్లో సిబ్బంది, భద్రతా బలగాలు, సందర్శకులు, పార్లమెంటరీ కార్యకలాపాలు పరిమితంగా ఉండేవన్నారు. ఆ తర్వాతి కాలంలో పార్లమెంటరీ కార్యకలాపాలు, సిబ్బంది, సందర్శకుల్లో ఎన్నో రెట్ల పెరుగుదల ఉందని చెప్పారు.
పార్లమెంటరీ పర్యవేక్షణ విధుల పెరుగుదలకు అవకాశం ఉందని స్పీకర్ వివరించారు. దీనికితోడు కమిటీల సంఖ్య, భద్రతా అవసరాలు పెరుగుతుండటం వల్ల ఖాళీ ప్రదేశానికి డిమాండ్ అనేక రెట్లు పెరిగిందన్నారు.
సాంకేతిక పరిజ్ఞానం పెరగడం వల్ల ఎంపీలకు అధునాతన పరికరాలను సమకూర్చాల్సిన అవసరం ఏర్పడిందని స్పీకర్ తెలిపారు. దీనివల్ల మెరుగైన సాంకేతిక సాధనాలను వారు ఉపయోగించగలగడంతోపాటు పార్లమెంటు కూడా కాగితరహితంగా మారుతుందని వివరించారు.
ఇందుకోసం లోక్సభ చాంబర్లోని సీటింగ్ ఏర్పాట్లను పునర్వ్యవస్థీకరించాల్సి ఉంటుందని అన్నారు. దీనికి పరిమితులు ఉండటం వల్ల కొత్త భవన నిర్మాణాన్ని చేపట్టాలని ఆమె సూచించారు. ప్రస్తుత భవనాన్ని ‘గ్రేడ్-ఐ వారసత్వ నిర్మాణం'గా వర్గీకరించిన నేపథ్యంలో దానికి నిర్మాణ సంబంధ మరమ్మతులు, జోడింపులు, మార్పులు చేపట్టడానికి తీవ్ర పరిమితులు ఉన్నాయన్నారు. అందువల్ల రెండు అవకాశాలను పరిశీలించాలని స్పీకర్ కోరారు.
‘ఇందులో ఒకటి.. ప్రస్తుత పార్లమెంటు సముదాయంలోనే కొత్త భవనాన్ని నిర్మించి, కొన్ని వసతులు, సేవలను అందులోకి మార్చడం. రెండోది.. రాజ్పథ్కు మరోవైపున పార్లమెంటు కొత్త భవనాన్ని నిర్మించడం' అని స్పీకర్ సుమిత్రా మహాజన్ తెలిపారు.
ప్రస్తుత భవనానికి, ప్రతిపాదిత కొత్త సముదాయానికి మధ్య భూగర్భంలో ఒక మార్గాన్ని నిర్మించాలని సూచించారు. కాగా, కొత్త పార్లమెంటును నిర్మించాలన్న ప్రతిపాదన ఏడాది క్రితం జరిగిన బడ్జెట్ కమిటీ సమావేశంలో తెరపైకి వచ్చింది. రానున్న 100 సంవత్సరాల అవసరాలకు అనుగుణంగా కొత్త భవనాన్ని నిర్మించాలని ప్రజా పద్దుల కమిటీ చైర్మన్ కేవీ థామస్ నాడు చెప్పారు.