కేజ్రీవాల్ సిఫార్సుకు నో: ఢిల్లీలో రాష్ట్రపతి పాలనే
న్యూఢిల్లీ: ఢిల్లీ శానససభను రద్దు చేయాలనే ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ సిఫార్సును లెఫ్టినెంట్ గవర్నర్ తోసిపుచ్చారు. ఢిల్లీ శాసనసభను సుప్తచేతనావస్థలో ఉంచి, రాష్ట్రపతి పాలన విధించాలని ఆయన సిఫార్సు చేసినట్లు పిటిఐ వార్తా సంస్థ తెలిపింది. జన్ లోక్పాల్ బిల్లును శాసనసభలో ప్రవేశపెట్టడానికి కాంగ్రెసు, బిజెపి అడ్డు తగలడంతో తీవ్ర ఆగ్రహానికి గురైన కేజ్రీవాల్ శుక్రవారం సాయంత్రం ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు.
ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం తప్పుకున్న నేపత్యంలో తలెత్తిన పరిస్థితిని వివరిస్తూ లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ శనివారంనాడు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి నివేదిక సమర్పించారు. తన నివేదికతో పాటు ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వ రాజీనామాను రాష్ట్రపతికి పంపించారు.

శాసనసభను రద్దు చేయాలా, రాష్ట్రపతి పాలన విధించాలా అనేది ఏదీ చెప్పకుండా జంగ్ నివేదిక పంపినట్లు తొలుత వార్తలు వచ్చాయి. అయితే, రాష్ట్రపతి పాలనకు లెఫ్టినెంట్ గవర్నర్ సిఫార్సు చేసినట్లు పిటిఐ వార్తాకథనం తెలియజేస్తోంది. లెఫ్టినెంట్ గవర్నర్ సిఫార్సు పట్ల కాంగ్రెసు పార్టీ హర్షం వ్యక్తం చేసింది.
ఢిల్లీ శాసనసభ ఎన్నికలు నిర్వహిస్తే తాము సిద్ధంగా ఉన్నట్లు బిజెపి ప్రకటించింది. ఎన్డీయెలో చేరే విషయంపై కేజ్రీవాల్ స్పందించలేదు. ఢిల్లీలో తక్షణం ఎన్నికలు జరపాలని ఆయన డిమాండ్ చేశారు. లోకసభ ఎన్నికల్లో తాను పోటీ చేస్తానని చెప్పారు. అయితే, ప్రధాని రేసులో మాత్రం లేనని చెప్పారు
కాగా, ఈ నెల 23వ తేదీ నుంచి అవినీతికి వ్యతిరేకోద్యమంలో భాగంగా దేశమంతా పర్యటించాలని కేజ్రీవాల్ నిర్ణయించుకున్నారు. హర్యానా నుంచి ఆ ఉద్యమం ప్రారంభమవుతుంది. మార్చి 2వ తేదీన ఉత్తరప్రదేశ్లో ర్యాలీ ఉంటుంది. కేజ్రీవాల్ నాయకత్వంలో లోకసభ ఎన్నికల్లో పోటీ చేస్తామని ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు యోగేంద్ర యాదవ్ చెప్పారు.












Click it and Unblock the Notifications