అంతులేని విషాదం: గుండె తరుక్కుపోయేలా.., మృత్యువు వెంటాడిన వేళ..
లూదియానా పాలిమర్ ఫ్యాక్టరీ అగ్ని ప్రమాదం అంతు లేని విషాదాన్ని మిగిల్చింది. కుటుంబ సభ్యులను కోల్పోయినవాళ్లు గుండెలవిసేలా రోదిస్తున్నారు
న్యూఢిల్లీ: లూథియానా పాలిమర్ ఫ్యాక్టరీ అగ్ని ప్రమాదం అంతు లేని విషాదాన్ని మిగిల్చింది. కుటుంబ సభ్యులను కోల్పోయినవాళ్లు గుండెలవిసేలా రోదిస్తున్నారు.
ప్రమాదం జరిగిన రోజు.. మంటలను ఆర్పడానికి శాయా శక్తుల ప్రయత్నించినవాళ్లు కూడా చివరికి అదే అనుకోని ఘటనతో ప్రాణాలు కోల్పోవడం చాలామందిని కంటతడి పెట్టించింది.
ఆరోజు ఏమైంది?:
మంగళవారం లూథియానా పాలిమర్ ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మంటలను అదుపు చేసేందుకు ఫైరింజన్ బృందాలు రంగంలోకి దిగాయి. ఇందులో సబ్ ఫైర్ ఆఫీసర్గా పనిచేస్తున్న రాజ్ కుమార్, అదే బృందంలో విధులు నిర్వహిస్తున్న ఆయన కుమారుడు సన్నీ కూడా ఉన్నారు.
అనుకోని ప్రమాదం:
ఫ్యాక్టరీలో ఎగసిపడ్డ మంటలను ఫైరింజన్ యంత్రాంగం దాదాపు అదుపులోకి తీసుకొచ్చింది. దీంతో కొంతసేపు విశ్రాంతి తీసుకుందామని సన్నీ ఆ భవనం నుంచి బయటకొచ్చాడు. ఆయన తండ్రి రాజ్ కుమార్ మాత్రం భవనంలోనే ఉండిపోయాడు. ఇంతలోనే ఫ్యాక్టరీలో ఏదో పేలుడు సంభవించి అనూహ్యంగా ఆ భవనం కుప్పకూలిపోవడం.. రాజ్ కుమార్ శిథిలాల కింది చిక్కుకుపోవడం జరిగిపోయాయి.
అద్భుతం జరగలేదు
ప్రమాద ఘటనను పరిశీలించేందుకు పంజాబ్ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ వచ్చారు. 'ఏదైనా అద్భుతం జరిగి వాళ్లంతా బయటకొస్తారు' అని ఆశాభావం వ్యక్తం చేశారు. బాధితులను ఓదార్చి వెళ్లారు. కానీ ఆయన చెప్పినట్టు అద్భుతమేది జరగలేదు. శిథిలాల కింద పడివున్న తండ్రి మృతదేహాన్ని ఎత్తుకుని సన్నీ రోదిస్తూ బయటకు వచ్చాడు.
తండ్రిని కోల్పోయిన సన్నీ దు:ఖాన్ని ఆపడం ఎవరివల్లా కాలేదు. అక్కడున్న పోలీసులు కూడా సన్నీని చూసి కంటతడి పెట్టుకున్నారు. రాజ్ కుమార్ తిరిగొస్తాడన్న నమ్మకంతో ఎదురుచూసిన కుటుంబ సభ్యులు కూడా అతన్ని విగతజీవిలా చూసేసరికి తట్టుకోలేకపోయారు.
12కి చేరిన మృతుల సంఖ్య:
ఇదే ప్రమాదంలో రాజ్ కుమార్తో పాటు మరో ఫైర్ ఆఫీసర్ రాజేందర్ శర్మ కూడా ప్రాణాలు కోల్పోయారు. మరో ఫైర్ మ్యాన్ సుఖ్దేవ్ సింగ్ శిథిలాల కింద చిక్కుకుని ఉంటాడని భావిస్తున్నారు. అతను క్షేమంగా బయటకు రావాలని అతని తండ్రి ప్రకాశ్ సింగ్ ఎదురుచూస్తున్నాడు. 'అద్భుతం జరిగితే నా కొడుకు సజీవంగా బయటికి వస్తాడు.. లేదా కనీసం నా కుమారుడి మృతదేహాన్నైనా తీసి అప్పగించండి' అంటూ ఆ తండ్రి కన్నీళ్లు పెట్టుకుంటున్నాడు. ఈ ప్రమాద ఘటనలో మృతుల సంఖ్య 12కి చేరింది.