శశికళ ఫ్యామిలీ కష్టాలు, టీటీవీ దినకరన్ సోదరి, ఆమె భర్తకు జైలు శిక్ష ఖరారు, హై కోర్టులో !
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి కావాలని ఆశపడి చివరికి బెంగళూరు పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్లో శిక్ష అనుభవిస్తున్న శశికళ కుటుంబ సభ్యులకు కష్టాలు మొదలైనాయి. ఓ వైపు ఆదాయపన్ను శాఖ దాడులు, మరోవైపు అక్రమాస్తుల కేసులో జైలు శిక్షలు ఖరారు కావడంతో మన్నార్ గుడి మాఫియా ఉక్కిరిబిక్కిరి అవుతోంది.
వీకే శశికళ నటరాజన్ సోదరి వనితామణి కుమార్తె శ్రీతలాదేవి, ఆమె భర్త 'ఆర్ బీఐ'భాస్కరన్ లకు సీబీఐ కోర్టు విధించిన జైలు శిక్షను మద్రాసు హైకోర్టు ఖరారు చేసింది. అన్నాడీఎంకే పార్టీ నుంచి బహిష్కరణకు గురైన టీటీవీ దినకరన్ సొంత చెల్లెలు శ్రీతలదేవి.
శ్రీతలదేవి భర్త భాస్కరన్ రిజర్వు బ్యాంకు మాజీ ఉద్యోగి. 1988- 1997 మధ్య కాలంలో భాస్కరన్ తన భార్య శ్రీతలదేవి పేరు మీద రూ. 1. 68 కోట్ల అక్రమాస్తులు కూడబెట్టారని గుర్తించిన సీబీఐ 1998లో కేసు నమోదు చేసింది. కేసు సీబీఐ ప్రత్యేక కోర్టులో విచారణ జరిగింది.
2008లో సీబీఐ ప్రత్యేక కోర్టు భాస్కరన్ కు ఐదేళ్లు జైలు శిక్ష, రూ. 20 లక్షలు జరిమానా, శ్రీతలదేవికి మూడేళ్లు జైలు శిక్ష, రూ. 10 లక్షలు జరిమానా విదిస్తూ తీర్పు చెప్పింది. 2008లో భాస్కరన్, శ్రీతలదేవి మద్రాసు హై కోర్టును ఆశ్రయించారు. మద్రాసు హై కోర్టు సీబీఐ కోర్టు విధించిన శిక్షను నిలిపివేస్తూ విచారణ చేపట్టింది. సీబీఐ కోర్టు ఇచ్చిన తీర్పుతో ఏకీభవించిన మద్రాసు హై కోర్టు న్యాయమూర్తి జయచంద్రన్ భాస్కరన్, శ్రీతలదేవికి అదే శిక్షలు ఖరారు చేశారు.