నీలిచిత్రాలు చూపించి ముగ్గరు బాలికలపై రేప్: 80 ఏళ్ల వృద్ధుడికి జీవిత ఖైదు
చెన్నై: ముగ్గురు చిన్నారులపై అత్యాచారానికి పాల్పడిన కేసులో 80 ఏళ్ల వృద్ధుడికి మద్రాసు హైకోర్టు డివిజన్ బెంచ్ యావజ్జీవ కారాగార శిక్షను విధిస్తూ తీర్పుని వెలువరించింది. అంతేకాదు యావజ్జీవ కారాగార శిక్షను ఆపాలంటూ ఆయన వేసిన పిటిషన్ను కూడా కొట్టి వేసింది.
ఈ కేసులో రీ హియరింగ్ కోసం ట్రయల్ కోర్టుకు వెళ్లే అవకాశాన్ని కూడా లేకుండా చేసింది. వివరాల్లోకి వెళితే సరిగ్గా ఆరు సంవత్సరాల క్రితం మార్చి 1, 2010న నిందితుడు సోమసుందరం అలియాస్ కనగరాజ్ 10 నుంచి 12 సంవత్సరాలున్న ముగ్గురు బాలికలను నమ్మించి తనతో తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు.
ప్రాసిక్యూషన్ వివరాల ప్రకారం దక్షిణ చెన్నైలోని వాషర్మెన్పేట్లో నివాసం ఉంటున్న చిన్నారుల తల్లిదండ్రులు పనుల నిమిత్తం ఇంటి నుంచి బయటకు వెళ్లారు. ఈ క్రమంలో తొలుత 12 ఏళ్ల వయసున్న బాలికకు చాక్లెట్లు ఆశచూపి తన ఇంటికి తీసుకుని వెళ్లాడు.
అనంతరం బాలికకు నీలిచిత్రాలు చూపించి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత మరో ఇద్దరు బాలికలను ఇదే విధంగా ఒకరి తర్వాత ఒకరిపై అత్యాచారానికి పాల్పడినట్టు దర్యాప్తులో వెల్లడైంది. అత్యాచార అనంతరం ఈ విషయం ఎవరికైనా చెబితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని వారిని భయపెట్టాడు.
అయితే తొలుత అత్యాచారానికి గురైన బాలికకు పొత్తి కడుపులో నొప్పి రావడంతో ఆసుపత్రికి తీసుకెళ్లిన తల్లిదండ్రులకు వైద్యులు బాలికపై అత్యాచారం జరిగిందని చెప్పడంతో విషయం వెలుగు చూసింది. దీంతో బాధితురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు..
అనంతరం కోర్టులో ప్రవేశపెట్టగా కేసును విచారించిన న్యాయస్థానం వృద్ధుడిని దోషిగా తేల్చి యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. ఇక్కడ విశేషం ఏమిటంటే అత్యాచారానికి పాల్పడినప్పుడు వృద్ధుడి వయసు 74 ఏళ్లు కాగా, 80 ఏళ్లకు అతడికి శిక్ష పడింది.