డీఎంకే నేత రాజాకు మద్రాస్ హైకోర్టులో చుక్కెదురు- ఈసీ నిర్ణయంపై జోక్యానికి నో
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం పళినిస్వామిపై అనుచిత వ్యాఖ్యలు చేసి ఈసీ నిషేధం ఎదుర్కొంటున్న డీఎంకే నేత, మాజీ కేంద్రమంత్రి ఆండిముత్తు రాజాకు మద్రాస్ హైకోర్టులోనూ చుక్కెదురైంది. ఈసీ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ రాజా దాఖలు చేసిన పిటిషన్ను హైకోర్టు ఇవాళ కొట్టేసింది. ఈసీ నిర్ణయంలో జోక్యానికి హైకోర్టు నిరాకరించింది.
తమిళనాడు ఎన్నికల ప్రచారంలో సీఎం పళని స్వామిపై డీఎంకే నేత రాజా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీనిపై ఆ తర్వాత పళని స్వామి సైతం ఆవేదన వ్యక్తం చేయడంతో రాజా సారీ చెప్పారు. అయితే ఈ వ్యాఖ్యలపై అప్పటికే అన్నాడీఎంకే నేతల నుంచి ఫిర్యాదు రావడంతో ఎన్నికల కమిషన్ రాజా ప్రచారం చేయకుండా 48 గంటలపాటు నిషేధం విధించింది. ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ఆయన మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై ఇవాళ విచారణ జరిగింది.
డీఎంకే నేత రాజా ప్రచారంపై నిషేధం విధించిన ఈసీ ఆయన్ను పార్టీ స్టార్ క్యాంపెయినర్ల జాబితా నుంచి తప్పించింది. అంతే కాదు ఆయన్న మరోసారి మహిళల గౌరవానికి భంగం కలిగించేలా ఎలాంటి వ్యాఖ్యలు చేయొద్దని మందలించింది. రాజాపై ఈసీ విధించిన నిషేధం ఎల్లుండి మధ్యాహ్నం 3 గంటల వరకూ కొనసాగనుంది. అయితే ఈ నెల 6న తమిళనాడులో ఒకే దశలో ఎన్నికలు జరగబోతున్నాయి. దీంతో ప్రచార గడువు 4వ తేదీతో ముగియనుంది. రాజా నిషేధం పూర్తయ్యాక ఒక్క రోజు మాత్రమే ఆయన ప్రచారం నిర్వహించేందుకు అవకాశం ఉంటుంది.